గత చంద్రబాబు ప్రభుత్వం మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసింది. ఇంకా చెప్పాలంటే రాజధాని అమరావతి ప్రభావంతో మంగళగిరి నియోజకవర్గ ప్రజలు కోటీశ్వరులు అయ్యారు. ఈ నియోజకవర్గ ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. గత టిడిపి ప్రభుత్వ హయాంలో వీళ్లంతా కోట్లకు పడగలెత్తారు. మంగళగిరి రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. నిజంగా అమరావతి అభివృద్ధి జరిగి ఉంటే ప్రపంచ స్థాయిలో మంగళగిరి కి మంచి గుర్తింపు వచ్చి ఉండేది.
ఎప్పుడు అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చి మూడు రాజధానులు, రాజధాని వికేంద్రీకరణ అన్నారో ఐదేళ్ల పాటు ఓ వెలుగు వెలిగిన మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల ప్రజలు కుదేలయ్యారు. కోట్లలో పెట్టుబడులు పెట్టిన వారు. భూములు అమ్ముకున్న వారు.. రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన వారి జీవితాలు తల్లకిందులు అయ్యాయి.
ఇక చంద్రబాబు ప్రభుత్వం అంత అభివృద్ధి చేసినా ఆయన కుమారుడు మంత్రిగా ఉండి ఇక్కడ పోటీ చేస్తే మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఓడించారు. అయితే ఇప్పుడు చాలా మందిలో పశ్చాత్తాపం కనపడుతోంది. ఓడినా లోకేష్ మాత్రం తమ నియోజకవర్గాన్ని ఏనాడు వదల్లేదని.. తమ కోసం, నియోజకవర్గం కోసం సాయం చేస్తూనే ఉన్నారని చెప్పుకుంటున్నారు.
ఈ క్రమంలోనే మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ నుంచి ప్రతి రోజు టీడీపీలో చేరికలు నడుస్తున్నాయి. తాజాగా మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన మండల వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఈపూరి రవితో పాటు 50 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. మంగళవారం రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎం.ఎస్ రాజు వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
వైసీపీ నిరంకుశ వైఖిరి, పార్టీలో సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో టీడీపీలో చేరినట్లు పార్టీ మారిన వారు చెపుతున్నారు. టీడీపీ పాలనలో ఎక్కడ చూసినా.. ప్రతి నిత్యం అభివృద్ధి పనులు జరిగేవని.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చాక చేసిన అభివృద్ధి ఎక్కడ ? అని వారు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా ఈ సారి చేనేతలు, ముస్లింలు.. దళితుల్లోనూ తీవ్రమైన మార్పు కనిపిస్తోంది. లోకేష్ ఈ సారి ఇక్కడ గట్టి విక్టరీ కొట్టబోతోన్న సంకేతాలు యేడాది ముందే కనిపిస్తున్నాయి.