ఏపీలో అధికార వైసీపీలో నేతల మధ్య ఆధిపత్య పోరు మామూలుగా లేదు. ఇప్పటికే పలు జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు – ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఏమాత్రం పొసగటం లేదు. తాజాగా ఉత్తరాంధ్రలో మంత్రి వర్సెస్ మాజీ మంత్రి మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో ఏం జరుగుతుంది ? పార్టీకి ఏ స్థాయిలో నష్టం జరగబోతుంది ? అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అధిష్టానం ఇద్దరి నేతల మధ్య ఎన్నిసార్లు సర్ది చెప్పే ప్రయత్నాలు చేస్తున్నా ఇద్దరు మనసులు కలిసే పరిస్థితులు లేవు.
ఆ ఇద్దరు నేతలు ఎవరో కాదు ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మరొకరు మాజీ మంత్రి దాడి వీరభద్రరావు. ఇద్దరు అధికార వైసీపీలో ఉన్నారు. ఈ ఇద్దరి రాజకీయ వ్యక్తులకు అనకాపల్లి పొలిటికల్ కేంద్రంగా మారింది. అమర్నాథ్కు, దాడికి మధ్య అస్సలు పడటం లేదు. ఎవరి శిబిరం వాళ్ళదే అన్నట్టుగా ఉంది. వీరిద్దరూ స్వపక్షంలోనే విపక్షంగా ఉంటున్నారు. వచ్చే ఎన్నికలలో అనకాపల్లి టిక్కెట్ గవర సామాజిక వర్గానికి ఇస్తారని ప్రచారం జరుగుతుంది.
దీంతో ఆ సామాజిక వర్గానికి చెందిన దాడి ఇక్కడ యాక్టివ్ అవుతున్నారని సమాచారం. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో దాడికి సీటు ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే జగన్ కోలా గురువులకు సీటు ఇవ్వగా ఆయన ఓడిపోయారు. ఇక గాజువాకలో నివాసం ఉండే గుడివాడ అమర్నాథ్ ఈసారి అనకాపల్లిలో పోటీ చేస్తారో లేదో తెలియదు.
ఈసారి అమర్నాథ్ గాజువాక నుంచి పోటీ చేస్తారని లేదా యలమంచిలి నుంచి కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. అమర్నాథ్కు ఎక్కడ సీటు ఇస్తారో తెలియదు.. కానీ తాను మాత్రం అనకాపల్లిలో పట్టు కోల్పోకుండా ఉండేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా అనకాపల్లి నూకాంబిక అమ్మవారి జాతర వేదికగా జరిగిన పరిణామాలు ఒకరికి ఒకరు చెక్ పెట్టుకునే దిశగా వెళ్లాయి.
ఇక ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలను మంత్రి అస్సలు పట్టించుకోలేదని.. అందుకే ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ సీటులో వైసిపి ఓడిపోయిందని దాడి అనుచరులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఇద్దరు నేతల మధ్య ఆధిపత్యం పోరులో ఇప్పుడు అంతిమంగా పార్టీ నష్టపోతుందని.. జగన్కు ఇద్దరు కలిసి షాక్ ఇస్తారా ? అన్న ఆందోళనలు ఆ పార్టీ నేతల్లోనే వినిపిస్తున్నాయి.