తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇద్దరు కీలక నేతలను సస్పెండ్ చేయడం ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది. అధికార బీఆర్ఎస్ పార్టీలో అయితే తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి. అయితే ఈ లిస్టులో బీఆర్ఎస్ నుంచి ఇంకెంతమంది బయటకు వెళతారు ? అన్న చర్చలు కూడా నడుస్తున్నాయి.
ఇక పొంగులేటి గత రెండేళ్లుగా పార్టీలో తీవ్రమైన ఉక్కపోతకు గురవుతున్నారు. గత ఐదారు నెలలుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాల పేరుతో సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పొంగులేటితో పాటు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇక పొంగులేటిని పార్టీ నుంచి సస్పెండ్ చేశాక… ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పార్టీ నేతలు అందరూ పొంగులేటిపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు.
అయితే జిల్లాకే చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాత్రం మౌనంగా ఉంటున్నారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుతో పాటు మంత్రి పువ్వాడ అజయ్, జిల్లాకు చెందిన మంత్రులు అందరూ పొంగులేటిపై విమర్శలు చేస్తున్నారు. అయితే తుమ్మల ఎందుకు ? మాట్లాడడం లేదు. కేసీఆర్కు ఎంతో ఆప్తుడిని అని చెప్పుకునే తుమ్మల మౌనం వెనక ఇప్పుడు జిల్లా అధికార పార్టీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
తుమ్మల కూడా గత కొంత కాలంగా బీఆర్ఎస్లో ఉండలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన బీజేపీలోకి వెళతారన్న ప్రచారం కొంత కాలంగా జరిగింది. అందుకే పొంగులేటి విషయంలో ఆయన సైలెంట్గా ఉన్నారా ? లేదా పొంగులేటితో కలిసి ప్రయాణిస్తారా ? అని కూడా చర్చకు వస్తోంది. విచిత్రం ఏంటంటే గత ఎన్నికల్లో పాలేరులో తుమ్మలతో పాటు జిల్లాలో బీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులు ఓడిపోవడం వెనక పొంగులేటి వ్యతిరేకంగా చేయడమే అని.. తుమ్మల పొంగులేటిపై ఫిర్యాదు చేయడంతోనే ఆయనకు ఎంపీ టిక్కెట్ రాలేదన్న టాక్ ఉంది.
మరి అలా కత్తులు దూసుకున్న ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు చేతులు కలిపి ఒక్కటి కాబోతున్నారా ? ఇలా రకరకాల ప్రచారాలు నడుస్తున్నాయి. మరి తుమ్మల మౌనం వీడకపోతే ఆయన పొలిటికల్ రూటుపై మరిన్ని అనుమానాలు వచ్చేలా ఉన్నాయి.