టీడీపీ ప్రతిష్టాత్మకంగా ఏటా నిర్వహించే పార్టీ ఆవిర్భావ సదస్సు.. `మహానాడు`కు ఈ సారి మరింత జోరు పెరగనుంది. దీనికికారణం.. ఈసారి రాజమండ్రిలో నిర్వహించాలని నిర్ణయించారు. తాజాగా చంద్రబాబు కీలక నేతలతో చర్చించి తీసుకున్న నిర్ణయం మేరకు.. వచ్చే మే నెలలో నిర్వహించే ఈ మహానాడుకు రాజమండ్రి వేదిక కానుంది. అయితే.. దీనివెనుక పెద్ద సెంటిమెంటు ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు.
రాజమండ్రిలో గతంలో నిర్వహించిన మహానాడు అనంతరం.. వచ్చిన ఎన్నికల్లో పార్టీ విజయం దక్కించుకుని అధికారంలోకి వచ్చిందని.. అదే సెంటిమెంటును దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కూడా రాజమండ్రిలో నిర్వహించాలని నిర్ణయించినట్టు చెబుతు న్నారు. పైగా.. ఉభయ గోదావరి జిల్లాల్లో పార్టీ పుంజుకోవడం.. వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యాన్ని నిర్ణయించుకోవ డం దరిమిలా.. రాజమండ్రిని ఎంచుకున్నట్టు తెలుస్తోంది.
అదేవిధంగా ఎన్టీఆర్ శతజయంతి సందర్బంగా 100 సభలు నిర్వహించాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. ఈసారి ఎన్నికల మ్యానిఫెస్టోని భిన్నంగా రూపొందించేందుకు కసరత్తు చేస్తోంది. అలాగే ఆర్ధిక తారతమ్యం లేకుండా ఆదాయాన్ని అందరికీ పంచే విధంగా మ్యానిఫెస్టో రూప కల్పన చేయాలని నిర్ణయం తీసుకుంది. మరో నెల రోజుల పాటు ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రూప కల్పన చేశారు.
అలాగే నవంబర్లో తెలంగాణా ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా పోటీ చేయాలని.. నిర్ణయించారు. ఏపీలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సంసిద్దంగా ఉండాలని పార్టీ క్యాడర్, లీడర్లకు దిశానిర్దేశం చేశారు. అలాగే పార్టీ సభ్యత్వంలో జీవితకాల (లైఫ్ టైమ్) మెంబర్షిప్ను చేర్చాలని నిర్ణయం తీసుకుంది. వైసీపీ వచ్చే ఎన్నికల్లో భారీ ఎత్తున ఓటుకు డబ్బులు ఇచ్చినా కూడా ఓటర్లు ప్రభావితం కాకుండా.. టీడీపీ వైపు ప్రయాణించేలా క్షేత్రస్థాయిలో నాయకులు ముందుకు కదలాలని .. చంద్రబాబు మరోసారి తేల్చి చెప్పారు.