ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికార వైసీపీకి అదిరిపోయే షాక్ తగిలింది. వాస్తవంగా చూస్తే వైసీపీకి ఏడు ఎమ్మెల్సీలను గెలిపించుకునే బలం ఉంది. వైసీపీకి ఉన్న 151 మంది ఎమ్మెల్యేలకు తోడు టిడిపి నుంచి ఆ పార్టీ చెంత చేరిన నలుగురు ఎమ్మెల్యేలతో పాటు.. జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు సైతం ఇప్పటికే వైసీపీకి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే టిడిపి అధినేత చంద్రబాబు అనూహ్యంగా తమ పార్టీ నుంచి బిసి మహిళ అభ్యర్థిగా విజయవాడ మాజీ మేయర్ పంచుమర్తి అనురాధను రంగంలోకి దింపారు.
అనూహ్యంగా అనురాధ అందరికంటే ఎక్కువగా 23 ఓట్లు గెలుచుకొని తొలి ప్రాధాన్యత ఓట్లలో ఎమ్మెల్సీగా ఘనవిజయం సాధించారు. అనురాధ ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో.. వైసిపి అభ్యర్థి ఓటమి చెందక తప్పని పరిస్థితి. ఇక నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి – కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇద్దరు టిడిపికి ఓటేస్తారన్న సందేహాలు ముందు నుంచే ఉన్నాయి. అయితే వారిద్దరూ కాకుండా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా వైసీపీకి పెద్ద షాక్ ఇచ్చి తెలుగుదేశం అభ్యర్థి అనురాధకు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేశారు.
అయితే ఆ ఇద్దరు వైసిపి ఎమ్మెల్యేలు ఎవరు ? అన్నది ఇప్పుడు.. అటు వైసిపి వర్గాల్లోనూ, ఇటు రాజకీయ వర్గంలోనూ పెద్ద చర్చనీయాంసం గా మారింది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి క్రాస్ ఓటింగ్ చేసి ఉంటారన్న సందేహాలు, వైసిపి వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. ఆమెకు వచ్చే ఎన్నికల్లో టికెట్ లేదని జగన్ పరోక్షంగా సంకేతాలు పంపేశారని టాక్.ఇప్పటికే తాడికొండ ఇన్చార్జిగా వేరే వ్యక్తిని నియమించడంతో శ్రీదేవి ఆగ్రహంతో రగిలిపోతున్న సంగతి తెలిసిందే.
ఆమెతోపాటు టిడిపి నుంచి గెలిచి వైసిపికి సపోర్ట్ చేస్తున్న విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కూడా టిడిపికి క్రాస్ ఓటింగ్ చేశారా ? అన్న చర్చ అయితే జరుగుతోంది. గణేష్ కుమార్ పార్టీ మారినప్పుడు మాత్రమే జగన్ ను కలిసే అవకాశం వచ్చింది.. ఆ తర్వాత ఆయనకు ఎలాంటి ? ప్రాధాన్యత లభించలేదు.కొద్దిరోజులుగా ఆయన కూడా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. వచ్చే ఎన్నికలకు ముందు ఆయన తిరిగి టిడిపిలో చేరిపోతున్న ప్రచారం కూడా జరుగుతుంది. ఇక తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలలో శ్రీదేవి, గణేష్ ఇద్దరూ అధికార పార్టీకి షాక్ ఇచ్చి ఉంటారని అంటున్నారు. అయితే దీనిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.