ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బలం ఎక్కువనే సంగతి తెలిసిందే. రాయలసీమలో మిగిలిన జిల్లాల్లో వైసీపీ హవా ఉన్న..అనంతలో మాత్రం టీడీపీదే పైచేయి. ఇక్కడ టిడిపికి కంచుకోటలు ఎక్కువే. అయితే 2014 ఎన్నికల్లో టిడిపి సత్తా చాటింది గాని..2019 ఎన్నికల్లో దెబ్బతింది. జిల్లాలో 14 సీట్లు ఉంటే కేవలం 2 సీట్లు మాత్రమే గెలుచుకుంది.
అయితే ఆ పరిస్తితి నుంచి టిడిపి ఇప్పుడు పుంజుకుంటూ వస్తుంది. జిల్లాలో ఆధిక్యం దిశగా వెళుతుంది. ప్రస్తుతం 8 సీట్లలో టిడిపికి గెలుపు అవకాశాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో టిడిపికి 12 సీట్లు వచ్చాయి. ఇక ఆ పరిస్తితికి రావాలంటే టిడిపి ఇంకా కష్టపడాలి. కాకపోతే కొన్ని సీట్లలో నాయకులు సరిగ్గా లేకపోవడం వల్ల పార్టీ బలపడటం లేదు. అలా గుంతకల్లులో టిడిపి పరిస్తితి అలాగే ఉంది.
2008 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన ఈ స్థానంలో 2009లో కాంగ్రెస్ గెలవగా, 2014లో మాత్రం టిడిపి గెలిచింది. టిడిపి నుంచి జితేందర్ గౌడ్ గెలిచారు. 2019 ఎన్నికల్లో జితేందర్ టిడిపి నుంచి పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు. ఎమ్మెల్యేగా తీవ్ర వ్యతిరేకత తెచ్చుకోవడంతో దారుణమైన ఓటమి వచ్చింది. వైసీపీ అభ్యర్ధి వై. వెంకట్రామి రెడ్డి చేతిలో దాదాపు 48 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇంత భారీ తేడాతో ఓడటానికి జితేందర్ వ్యవహారశైలినే కారణమని చెప్పవచ్చు.
సరే ఈ నాలుగేళ్లలో ఏమైనా పికప్ అయ్యారా? అంటే అది లేదు..అటు వైపు వైసీపీ ఎమ్మెల్యేపై కాస్త వ్యతిరేకత కనిపిస్తున్నా సరే దాన్ని ఉపయోగించుకోలేని స్థితిలో జితేందర్ ఉన్నారు. దీంతో ఇక్కడ టిడిపి వెనుకబడింది. అయితే ఈ సారి జితేందర్కు సీటు ఇవ్వరని ప్రచారం వస్తుంది. కొత్త అభ్యర్ధిని బరిలో దింపే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. చూడాలి మరి గుంతకల్లులో టీడీపీ రాత మారుతుందో లేదో.