ఏపీలో ఇప్పటి వరకు రాజకీయ విమర్శలు, పొలిటికల్ విమర్శల క్రియేటివిటీ అంతా సోషల్ మీడియాలో జరిగేది. అయితే ఇప్పుడు ఏపీలో రాజకీయం అంతా స్టిక్కర్ల చుట్టూనే జరుగుతోంది. ఈ క్రియేటివిటీ ఇప్పుడు రోడ్లు, గోడల మీద కనిపిస్తోంది. మా నమ్మకం నువ్వే జగన్ అంటూ ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఓ ప్రోగ్రామ్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.
మా నమ్మకం నువ్వే జగన్ అంటూ స్టార్ట్ అయిన ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు రకరకాలుగా మారిపోయింది. ప్రతిపక్ష పార్టీల విమర్శలకు, ట్రోలింగ్కు అడ్డాగా మారిపోయింది. తాజాగా అన్నమయ్య జిల్లా రాజంపేటలో వేసిన పోస్టర్లు ఇప్పుడు అధికార పార్టీలో కలకలం రేపుతున్నాయి. మా నమ్మకం నువ్వే జగనన్న, కానీ రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి పై మాకు ఏ మాత్రం నమ్మకం లేదని పోస్టర్లు వేశారు.
రాజంపేటలో ఇప్పుడు ఈ పోస్టర్లు హైలెట్ అవుతున్నాయి. స్థానిక టిఫిన్ బండ్లతో పాటు కరెంట్ పోల్స్ మీద కూడా ఇవే పోస్టర్లు ఉన్నాయి. ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వ్యతిరేక వర్గం ఈ పోస్టర్లు వేశారని స్థానికంగా చర్చ నడుస్తోంది. అంటే ఇక్కడ వైసీపీ కేడర్ సీఎం జగన్ మీద తమకు నమ్మకం ఉందని చెపుతూనే.. ఎమ్మెల్యే మేడా మీద తమకు ఏ మాత్రం నమ్మకం లేదని చెపుతున్నట్టుగా ఉంది.
వచ్చే ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ ఇవ్వకూడదని వేడుకుంటూ.. ఇట్లు మోసపోయిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు అంటూ పోస్టర్ల కింద రాయడం దీనికి కొసమెరుపు. ఇప్పటి వరకు చాలా మంది స్థానిక నాయకులు తమ పార్టీ ఎమ్మెల్యేలు,, ఇతర నేతలపై తమ అసంతృప్తి ఎలా తెలియజేయాలా ? అని ఆలోచిస్తున్నారు. సోషల్ మీడియాలో ఫేక్ అక్కౌంట్లతో కామెంట్లు చేస్తున్నా పోలీసు కేసులు పెడితే ఎంక్వైరీలతో పట్టేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఇలా చేస్తుండడంతో ఎవ్వరికి దొరికే ఛాన్సు కూడా లేదు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలపై స్థానిక కేడర్లో ఉన్న అసంతృప్తి రాగాలు, అసమ్మతులు ఇలా బయట పడుతున్నాయి.