త్రేతా యుగంలో దశరథ మహారాజు, కౌసల్య దంపతులకు వసంత రుతువు చైత్ర శుద్ధ నవమి గురువారం రోజున పునర్వసు నక్షత్రపు కర్కాట లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరాముడు జన్మించారు. దశావతారాల్లో శ్రీమహావిష్ణువు ఏడవ అవతారంగా శ్రీరాముడిని చెప్తారు. హిందువులు ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారు. అయితే శ్రీరామనవమి రోజున చేయాల్సిన పనులు ఏంటి చేయకూడని పనులు ఏంటి అనేది తెలుసుకుందాం.
శ్రీరామనవమి రోజు చేయవలసిన పనులు :
సీతారాముల కళ్యాణం చేసేవారు మధ్యాహ్నం 12 గంటలకు చేయాలి. పూజ చేసే సమయంలో ఐదు వత్తులు వేసి దీపారాధన చేయాలి. ముందుగా దీపారాధన చేసి తరువాత తులసిమాలతో రాముడు విగ్రహాన్ని అలంకరించాలి. పూజ చేసేవారు కూడా తులసిమాలను ధరించాలి. పూజ పూర్తయిన తరువాత నిరుపేదలకు అన్నదానం చేయాలి. శ్రీరామరక్ష స్తోత్రం పాటించాలి. శ్రీరాముడికి సంబంధించిన పుస్తకాలను పంచిపెట్టి తాంబూలం ముత్తైదువులకు ఇవ్వాలి .
నవమి రోజున పాటించాల్సిన సూత్రాలు :
శ్రీరామనవమి రోజున ఉపవాసం ఉండి రాత్రి శ్రీరాముని నిష్టగా ఆరాధించాలి. రామాలయంకు వెళ్లి దేవుడిని దర్శించుకోవడం మంచిది. సీతారాములకు పంచామృతాలతో అభిషేకము, శ్రీరామ ధ్యాన శ్లోకములు, అష్టోత్తర పూజ, సీతారామ కళ్యాణం వంటి పూజా కార్యక్రమాలను జరిపిస్తే సకల సంపద, ఆయురారోగ్యాలు చేకూరుతాయి అన్నది నమ్మకం. శ్రీరామనవమి రోజున రామదేవుని కథ వ్రతం ఆచరించడం అత్యంత ఫలదాయకం. శ్రీరామనవమి తర్వాత రోజు భక్తితో దేవుడిని పూజించి.. బియ్యం పాయసం చేసి బంధువులకు, తోచినంత వరకు నిరుపేదలకు అన్నదానం చేస్తే మంచిది.
శ్రీరామనవమి రోజు చేయకూడని పనులు ;
మద్యం తాగడం, మాంసం సేవించడం, జుట్టు కత్తిరించుకోవడం, షేవింగ్ చేయడం లాంటి పనులు చేయకూడదు. ఇతరులను దూషించడం, అవమానించడం, ఎవరికి ద్రోహం చేయడం లాంటివి చేయరాదు. భాగస్వామిని మోసం చేయకూడదు. అందరితో మంచిగా ఉండాలి.
పైన చెప్పిన విధంగా శ్రీ రామనవమి జరుపుకొవటం మంచిది.