వైసీపీ నుంచి సస్పెన్షన్కు గురైన గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవెల్లి శ్రీదేవి ఈరోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆమె పార్టీ సూచించిన అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేశారన్న కారణం చూపి వైసిపి అధిష్టానం ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. పార్టీ నుంచి సస్పెండ్ అయిన అనంతరం శ్రీదేవి గత రెండు రోజులుగా ఎక్కడా కనిపించలేదు. ఆమె బెంగళూరు వెళ్లి ఉండవచ్చు అన్న ప్రచారం కూడా జరిగింది.
ఈ రోజు హైదరాబాదులో విలేకరుల సమావేశం పెట్టిన ఆమె వైసీపీ అధిష్టానంతో పాటు.. ఆ పార్టీ కీలక నేత సజ్జన రామకృష్ణారెడ్డిని టార్గెట్గా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దోచుకో పంచుకో తినుకో అనే విధానానికి తాను ముందు నుంచి అడ్డంగా ఉన్నందునే.. తనను అడ్డు తొలగించుకున్నారని ఆమె ఆరోపించారు. వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో నా గుండె పగిలిపోయిందని… నా భర్తకు పెద్ద ఆసుపత్రి ఉంది.. ఆదాయం ఉంది.. ఎమ్మెల్సీ కోసం అంత డబ్బు ఇస్తారా ? అని ఆమె ప్రశ్నించారు.
తాను డబ్బు తీసుకోలేదని ఎక్కడైనా ప్రమాణ స్వీకారం చేస్తాను.. రాజధాని అమరావతిపై ఎంతో మోసం చేశారని… అమరావతిలో జరిగిన అభివృద్ధిలో రాష్ట్రంలో ఎక్కడైనా కనీసం 10 శాతం అయినా చేశారా ? అని ఆమె ప్రశ్నించారు. తాను అమరావతికి అండగా ఉంటానని.. ఇళ్ల నిర్మాణం అనేది ఓ పెద్ద స్కాం అని.. జగన్ తండ్రికి తగ్గ తనయుడు అనుకున్నా.. విలువలు లేని రాజకీయాలు చేస్తున్నాడంటూ జగన్ను విమర్శించారు.
ఇక తాను నాలుగేళ్లుగా ఓ బానిసలా బ్రతికానని.. ఇప్పుడు ఆ బానిస జీవితానికి విముక్తి లభించిందని.. నేను స్వతంత్య్ర ఎమ్మెల్యేగా ఉంటానని చెప్పడంతో పాటు త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ కూడా ఇవ్వబోతున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక తాను ఏపీకి వెళ్లాలంటే తన ప్రాణానికి ఎలాంటి హానీ ఉండదని ఏపీ ప్రభుత్వ పెద్దలు హామీ ఇవ్వాలని.. సజ్జల రామకృష్ణా రెడ్డి వల్లే తనకు ప్రాణహానీ ఉందని.. ఏపీలో మహిళల ప్రాణాలకు రక్షణే లేదని శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.