గత ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెట్టి టిడిపి నుంచి ముగ్గురు ఎంపీలు గెలిచిన విషయం తెలిసిందే. శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు, విజయవాడ నుంచి కేశినేని నాని, గుంటూరు నుంచి గల్లా జయదేవ్ గెలిచారు. జగన్ గాలిలో కూడా వీరు టిడిపి నుంచి సత్తా చాటారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక టిడిపి గెలిచిన స్థానాల్లో పట్టు సాధించాలనే దిశగా రాజకీయం చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఎంత రాజకీయం చేసిన సరే శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడు బలం తగ్గించలేకపోయారు.
ఇక్కడ మరొక ట్విస్ట్ ఏంటంటే..వైసీపీ నుంచి పోటీ చేయడానికి సరైన నాయకుడు లేరు. 2014 నుంచి రామ్మోహన్ గెలుస్తున్న విషయం తెలిసిందే. 2014లో టిడిపి నుంచి రామ్మోహన్ బరిలో ఉంటే, వైసీపీ నుంచి రెడ్డి శాంతి పోటీ చేశారు. దాదాపు లక్షా 27 వేల ఓట్ల మెజారిటీతో రామ్మోహన్ గెలిచారు. ఇక 2019 ఎన్నికల్లో రామ్మోహన్ కు చెక్ పెట్టాలని వైసీపీ గట్టిగానే ప్రయత్నించింది. వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ని బరిలో దింపింది. కానీ విజయం రామ్మోహన్ నే వరించింది. 6 వేల ఓట్ల తేడాతో రామ్మోహన్ గెలిచారు.
అయితే ఎన్నికల్లో ఓడిపోయిన దువ్వాడని టెక్కలి ఇంచార్జ్ గా పంపారు. ఆయనకు ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో టెక్కలి నుంచే దువ్వాడ బరిలో దిగనున్నారు. దీంతో రామ్మోహన్ పై ఎవరు పోటీ చేస్తారనేది క్లారిటీ లేకపోయింది. 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచిన కిల్లి కృపారాణి ప్రస్తుతం వైసీపీలో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ఆమెకు సీటు విషయంలో గ్యారెంటీ లేదు. ఇక ఈమెని రామ్మోహన్ ప్రత్యర్ధిగా బరిలో దింపుతారని ప్రచారం వస్తుంది.
అదే సమయంలో ధర్మాన ప్రసాదరావు వారసుడుని పోటీకి దింపే అవకాశం కూడా ఉందని టాక్ వస్తుంది. అయితే ఎవరు బరిలో దిగిన రామ్మోహన్కు మళ్ళీ వైసీపీ చెక్ పెట్టలేదని తెలుస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ గాలి ఉన్నా సరే గెలవలేదు..ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అందులోనూ శ్రీకాకుళంలో వైసీపీపై వ్యతిరేకత ఎక్కువ అవుతోంది. ఈ క్రమంలోనే రామ్మోహన్కు చెక్ పెట్టడం వైసీపీకి సాధ్యంకాదనే ప్రచారం స్థానికంగా నడుస్తోంది. అటు జగన్ కూడా రామ్మోహన్ నాయుడును ఓడించేందుకు ఎన్ని ప్లాన్లు వేస్తున్నా అవేవి వర్కవుట్ అయ్యేలా కనపడట్లేదు.