ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ చాలా ఏళ్ల నుంచి గెలుపుకు దూరమైన నియోజకవర్గాల్లో జగ్గంపేట కూడా ఒకటి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ టిడిపి గెలిచి చాలా ఏళ్ళు అయిపోయింది. ఎప్పుడో 1999 ఎన్నికల్లో ఇక్కడ టిడిపి చివరిగా గెలిచింది. 1994, 1999 ఎన్నికల్లో టిడిపి నుంచి జ్యోతుల నెహ్రూ గెలిచారు. కానీ 2004లో ఓటమి పాలయ్యారు. 2009 ఎన్నికల్లో మాత్రం జ్యోతుల టిడిపిని వదిలి ప్రజారాజ్యంలోకి వెళ్ళి పోటీ చేసి ఓడిపోయారు.
ఇటు టిడిపి నుంచి జ్యోతుల చంటిబాబు పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు కాంగ్రెస్ గెలిచింది. 2014 ఎన్నికల్లో జ్యోతుల నెహ్రూ వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. కానీ అప్పుడు రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది..దీంతో జ్యోతుల టిడిపిలోకి జంప్ చేశారు. ఇక 2019 ఎన్నికల్లో ఆయన టిడిపి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇలా వరుసగా నాలుగు ఎన్నికల నుంచి జగ్గంపేటలో టిడిపి ఓడిపోతూ వస్తుంది. కానీ ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలనే కసితో జ్యోతుల పనిచేస్తున్నారు.
జగ్గంపేటలో ఆయన దూకుడుగా పనిచేస్తున్నారు. ఓ వైపు జ్యోతుల…మరోవైపు జ్యోతుల తనయుడు నవీన్..పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకెళుతున్నారు. ఇదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు పెద్దగా పాజిటివ్ గా కనిపించడం లేదు. గత ఎన్నికల్లో జగన్ గాలి..వరుసగా ఓడిపోతున్నారనే సానుభూతితో చంటిబాబు గెలిచారు. కానీ ఈ సారి ఆ పరిస్తితి కనిపించడం లేదు..పైగా నియోజకవర్గంలో సరైన అభివృద్ధి కార్యక్రమాలు చేయడం లేదు. దీంతో చంటిబాబుకు మైనస్ కనిపిస్తుంది. దీన్ని జ్యోతుల నెహ్రూ అడ్వాంటేజ్ గా తీసుకుని ముందుకెళుతున్నారు. వరుసపెట్టి వైసీపీ కీలక నేతలని టిడిపిలోకి తీసుకొస్తున్నారు. తాజాగా కూడా భారీ చేరికలు జరిగాయి. మొత్తానికి జగ్గంపేటలో జ్యోతుల విజయం ఖాయమైనట్లే కనిపిస్తుంది.