వైసిపి నుంచి సస్పెండ్ అయిన నలుగురు ఎమ్మెల్యేలలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఒకరు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి ఆయన అసెంబ్లీకి ప్రాథినిత్యం వహిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో మేకపాటి ఫ్యామిలీకి ఎలాంటి క్రేజ్ ఉందో ? తెలిసిందే. తన అన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి బాటలో నడిచిన చంద్రశేఖర్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. 2004లో కాంగ్రెస్ పార్టీ తరపున ఉదయగిరి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2009లోనూ మరోసారి విజయం సాధించారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆయన వీరాభిమాని. వైఎస్ఆర్ మరణం తర్వత జగన్ పార్టీ పెట్టినప్పుడు మరో మూడేళ్లపాటు తన ఎమ్మెల్యే పదవి ఉన్న దానిని స్వచ్ఛందంగా వదులుకున్నారు. ఈ క్రమంలోనే 2012లో జరిగిన ఉప ఎన్నికలలో ఆయన ఉదయగిరి నుంచి వైసిపి తరఫున ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో విజయం సాధించారు. నిన్న పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పుడు కూడా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తాను జగన్ కోసం తన ఎమ్మెల్యే పదవి సైతం వదులుకున్నానని.. కానీ ఇప్పుడు అదే జగన్ తనను సస్పెండ్ చేసి బయటకు పంపేశారని వాపోయారు.
2012 ఉప ఎన్నికలలో వైసీపీ నుంచి గెలిచిన చంద్రశేఖర్ రెడ్డి.. 2014 సాధారణ ఎన్నికలలో కేవలం 1800 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇక 2019 ఎన్నికలలో మరోసారి భారీ మెజార్టీతో విజయం సాధించి నాలుగోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇక తాను తప్పు చేయలేదని వైసిపి అధిష్టానం చెప్పినట్టే జయ మంగళ వెంకటరమణకు తాను ఓటు వేశానని… తాను వేసిన ఓటుతోనే వెంకటరమణ గెలిచారు.. ఈ విషయాలపై తాను దేవుడిపై ప్రమాణం చేస్తా.. నాపై ఆరోపణలు చేసేవారు అలా చేయగలరా ? అని సూటిగా ప్రశ్నించారు.
ఇక వచ్చే ఎన్నికలలో తనకు టిక్కెట్ దక్కకూడదని కొందరు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మేకపాటి మండిపడ్డారు. ఇక నేను డబ్బుకు అమ్ముడుపోయానని విమర్శలు చేస్తున్నారు. నాకు డబ్బుకు కొదవలేదు.. రాజకీయాల నుంచి తప్పుకున్న హాయిగా బతకగలను అని మేకపాటి స్పష్టం చేశారు. ఇక పార్టీకి తాను వెన్నుపోటు పొడవటం కాదని.. నాకే సీఎం జగన్ వెన్నుపోటు పొడిచారని మేకపాటి వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం పార్టీలో ఏ ఎమ్మెల్యేకు గౌరవం లేదు.. ఇన్నాళ్లు అవమానాలు భరిస్తూ వచ్చాం. ఇకనైనా గౌరవంగా బతికే అవకాశం దక్కిందని.. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాకు పదవులపై ఎలాంటి ఆశ లేదని మేకపాటి స్పష్టం చేశారు. ఏదేమైనా జగన్ కోసం నాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి తన పదవిని వదులుకొని భారీ రిస్క్ చేసి ఉప ఎన్నికలకు వెళ్లిన మేకపాటిని.. ఈరోజు ఇలాంటి ఘోరమైన అవమానంతో పార్టీ నుంచి బయటికి పంపడం సీనియర్ నేతలను సైతం కలవరపెడుతోంది.