నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్లో మాత్రమే కాదు.. తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే ఇండస్ట్రీ హిట్ సినిమాల జాబితాలో నరసింహనాయుడు సినిమా ఉంటుంది. 2001 సంక్రాంతి కానుకగా వెంకటేష్ దేవి పుత్రుడు – చిరంజీవి మృగరాజు సినిమాలతో పోటీపడి రిలీజ్ అయిన ఈ సినిమా ఓ ట్రెండ్ సెట్ చేసింది. భారతదేశ సినిమా చరిత్రలో మొట్టమొదటిసారిగా 100 కేంద్రాలలో వంద రోజులు ఆడిన సినిమాగా రికార్డులలో నిలిచిపోయింది.
ఆ రోజుల్లోనే ఇండస్ట్రీలో మొట్టమొదటి 20 కోట్ల రూపాయల సినిమాగా నిలిచింది. ఫుల్ రన్ లో నరసింహనాయుడు 22 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. అలాంటి ట్రెండ్ చేసిన రికార్డు క్రియేట్ చేసిన ఈ బ్లాక్ బస్టర్ సినిమాను బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 10న రెండు తెలుగు రాష్ట్రాలలో గ్రాండ్గా రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్లు కూడా అన్ని ఏరియాలో ప్రారంభమయ్యాయి.
అయితే నరసింహానాయుడు రీ రిలీజ్ కు ఆశించిన స్థాయిలో బుకింగ్స్ జరగటం లేదు. బాలయ్య హీరోగా నటించిన చెన్నకేశవరెడ్డి సినిమాను రీ రిలీజ్ చేస్తే బంపర్ ఓపెనింగ్స్ వచ్చాయి. చెన్నకేశవరెడ్డి ఏకంగా కోటి 50 లక్షల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇక రీ రిలీజ్ లో దాదాపు అన్ని సినిమాలు అదిరిపోయే వసూళ్లు రాబట్టాయి. అయితే ఈ సినిమాను జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాగా టార్గెట్ చేయడంతో పాటు పగబట్టినట్టుగా వ్యవహరిస్తున్నారట.
మామూలుగా నందమూరి అభిమానులు బాలయ్య సినిమా వచ్చినా, ఎన్టీఆర్ సినిమా వచ్చినా ఒక్కటై చూస్తారు. కానీ ఈ సారి నరసింహానాయుడు రీ రిలీజ్ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తాము వేరు అన్నట్టుగా బిహేవ్ చేస్తూ నరసింహానాయుడు టిక్కెట్లు కొనవద్దని కూడా సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారట.
అసలే ఎన్టీఆర్, బాలయ్య మధ్య గ్యాప్ ఉందన్న ప్రచారానికి తోడు… ఇటీవల ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ రాకపోవడం.. ఇది మరింతగా అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది. ఇక అక్కడ నుంచి ఇద్దరు హీరోల అభిమానులు ఎవ్వరూ తగ్గడం లేదు. చివరకు ఒకరి సినిమాను మరొకరు టార్గెట్ చేసేవరకు వెళ్లింది.