ఈరోజు ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. విచిత్రం ఏమిటంటే ప్రతిపక్ష టీడిపిలో ఉత్సాహం కనిపిస్తుండగా అధికార వైసీపీలో ముఖ్యమంత్రి జగన్ లో టెన్షన్ టెన్షన్ వాతావరణం ఉన్నట్టు తెలుస్తోంది. పోలింగ్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగునుంది. సాయంత్రం ఐదు గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. మొత్తం ఏడు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అధికార వైసిపి ఏడు స్థానాలకు అభ్యర్థులను రంగంలోకి దింపింది.
ఇక విపక్ష టీడిపి నుంచి విజయవాడకు చెందిన బీసీ మహిళ పంచుమర్తి అనురాధను చంద్రబాబు అనుహ్యంగా రంగంలోకి దింపారు. వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలతో విజయవాడలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్ నిండిపోయింది. వైసీపీ ప్రభుత్వం తమ ఎమ్మెల్యేలపై నిఘా పెట్టడంతో పాటు చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇప్పటికే మూడు నాలుగు సార్లు మాక్ పోలింగ్ కూడా నిర్వహించినట్టు తెలుస్తోంది.
అధికార పార్టీకి చెందిన నలుగురు, ఐదుగురు ఎమ్మెల్యేలు ఈ మాక్ పోలింగ్లో మూడు నాలుగు సార్లు తప్పులు చేశారని అంటున్నారు. ఇక టీడిపి క్రాస్ ఓటింగ్ పై ప్రధానంగా ఆశలు పెట్టుకుంది. ఒక ఎమ్మెల్యే అభ్యర్థి విజయం సాధించాలి అంటే మొత్తం 22 ఓట్లు రావాల్సి ఉంటుంది. టీడిపి నుంచి గత ఎన్నికలలో మొత్తం 23 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. వీరిలో నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీకి దూరమైన సంగతి తెలిసిందే. ఈ లెక్కను చూస్తే టీడిపికి కేవలం 19 మంది ఎమ్మెల్యేల ఓట్లు మాత్రమే పడతాయి.
అయితే వైసీపీలో రెబెల్ ఎమ్మెల్యేలుగా ఉన్న ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓట్లు తమకే పడతాయని టీడిపి భావిస్తుంది. ఈ లెక్కన మరొక ఎమ్మెల్యే ఓటు వేస్తే చాలు తమ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారని టీడిపి లెక్కలు వేసుకుంటుంది. టీడిపి నుంచి పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్యేలలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు తమకే ఓటు వేస్తారన్న ధీమాతో టీడిపి ఉంది.
దీనికి తోడు వైసీపీలో తీవ్రమైన అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలలో కూడా కొందరు తమకే ఓటు వేస్తారన్న ధీమాతో టీడిపి నేతలు లెక్కల్లో మునిగితేలుతున్నారు. ఏదేమైనా టీడిపిలో వస్తే కొండ… పోతే వెంట్రుక అన్నంత ధీమా కనిపిస్తుంటే అధికార వైసీపీలో మాత్రం వాతావరణం టెన్షన్ గా కనిపిస్తోంది.