ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలలో చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవరిని ఇప్పటికే వైసిపి వర్గాల్లోనే ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే తన సొంత మేనమామ, కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి కూడా బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్టు వైసిపి అంతర్గత చర్చల్లో ప్రచారం జరుగుతుంది. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడప మేయర్ గా ఉన్న రవీంద్రనాథ్ రెడ్డి ఆ తర్వాత 2014 – 2019 ఎన్నికలలో వరుసగా రెండుసార్లు కమలాపురం ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
2014 ఎన్నికలలో రవీంద్రనాథ్ రెడ్డి స్వల్ప తేడాతో గెలిచారు. అయితే వచ్చే ఎన్నికలలో ఆయన వరుసగా మూడోసారి గెలవడంపై నియోజకవర్గంలోనూ.. పార్టీ శ్రేణులను భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈసారి నియోజకవర్గంలో టిడిపి బలంగా పుంజుకున్న వాతావరణం కనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఇటీవల జగన్ కమలాపురం నియోజకవర్గంలో అంతర్గతంగా చేయించిన రెండు.. మూడు సర్వేలలోనూ అక్కడ వైసిపికి విజయావకాశాలు తక్కువగా ఉన్నాయని.. అలాగే ఎమ్మెల్యే పనితీరు సరిగా లేదని నివేదిక వచ్చినట్టు తెలుస్తోంది.
ఇక రవీంద్రనాథ్ రెడ్డి కూడా ఎంతసేపు జగన్ ను చూసి తనను గెలిపిస్తారన్న ధీమాతో ఉన్నారని.. నాయకులను, నియోజకవర్గంలో పార్టీని ఏమాత్రం పట్టించుకోలేదని కూడా స్థానికంగా ప్రచారం జరుగుతుంది. ఇక రవీంద్రనాథ్ రెడ్డి ప్రతిసారి నియోజకవర్గంలో ఎల్లారెడ్డినో… పుల్లారెడ్డినో చూడొద్దు. సీఎం జగన్ను చూసి మరోసారి వైసీపీకి ఓటు వేయండి అని పదేపదే చెప్తూ ఉంటారు. తనను రెండుసార్లు ఎన్నుకున్న నియోజకవర్గ ప్రజలకు ఈ మంచి పని చేశాను.. నియోజకవర్గాన్ని ఇలా అభివృద్ధి చేశాను అని ఆయన ఎప్పుడూ చెప్పుకున్న దాఖలాలు లేవని అంటారు.
తనపై భారీగా వ్యతిరేకత ఉందన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే.. ఈసారి తన కుమారుడిని బరిలోకి దించాలని ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఎమ్మెల్యే కుమారుడు నరేన్ రామాంజనేయులు రెడ్డి ఇప్పటికే నియోజకవర్గంలో జడ్పిటిసి గా ఉండడంతో పాటు వచ్చే ఎన్నికల బరిలో దిగేందుకు రెడీ అవుతున్నారు. అయితే జగన్ చేయించిన సర్వేలలో ఎమ్మెల్యే పై తీవ్రమైన వ్యతిరేకత ఉందని తేలినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోని అసలు తన మేనమామ కుటుంబాన్ని జగన్ పూర్తిగా పక్కన పెట్టేస్తారా ? లేదా ఆయన కొడుకుకి సీటు ఇచ్చి మేనమామను కొంత వరకు శాటిస్పై చేస్తారా ? అన్నది చూడాలి.