ఏపీలో ఎన్నికల ఏడాదిలో అధికార వైసీపీలో అంతర్గత పోరు రచ్చకెక్కుతోంది. ప్రతిపక్షాల సంగతి కాదు.. సొంత పార్టీలోనే కీలక నేతలు, మంత్రులుగా ఉన్న వాళ్లకే ఇప్పుడు అసమ్మతి పోరు ఓ రేంజ్లో ఉంది. ఇవేవో టీడీపీ అనుకూల మీడియాలో చిలువలు పలువలు చేసి చూపిస్తున్నవి అంతకన్నా కానేకావు. సొంత పార్టీ నేతలే తమ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలకు సీట్లు ఇస్తే చిత్తుగా ఓడిస్తామని వార్నింగ్ లు ఇస్తున్నారు.
రీసెంట్గా చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత, డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి, ఆయన సొంత నియోజకవర్గం గంగాధర నెల్లూరులో అసమ్మతి నేతలు పెద్ద షాకిచ్చారు. ఆయనకు మరోసారి టికెట్ ఇస్తే
ఓడిస్తామంటూ అధిష్టానానికి తేల్చి చెప్పారు. ఇక ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి అంబటి రాంబాబు వ్యవహారంలో కూడా ఇదే జరిగింది. ఇప్పుడు అదే ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన పార్టీ మహిళా మంత్రి విడదల రజిని విషయంలో కూడా అసమ్మతి వర్గం ఏకంగా అధిష్టానానికే సవాళ్లు రువ్వుతోంది.
వచ్చే ఎన్నికల్లో రజనీకి సీటు ఇస్తే తాము ఆమెకు సహకరించబోమని.. అవసరం అయితే ఇండిపెండెంట్గా ఓ క్యాండెట్ను కూడా పోటీలోకి దింపుతామని చెపుతోంది. మంత్రి సొంత నియోజకవర్గంలో అధికార పార్టీలోనే పంచాయితీ రచ్చకెక్కడంతో చిలకలూరిపేట టికెట్ వ్యవహారం హాట్ హాట్ గా మారింది. పల్నాడు జిల్లా ప్రాంతీయ సమన్వయకర్తగా ఉన్న రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్ రావు ముందు నియోజకవర్గంలోని మున్సిపాల్టీతో పాటు మూడు మండలాల నాయకులు ఇప్పుడు ఈ పంచాయితీ పెట్టారు.
నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున అసమ్మతి నాయకులు మస్తాన్రావును కలిశారు. అసలు నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశానికి కూడా తమను పిలవడం లేదని వారు ఫిర్యాదు చేశారు. వీరందరి ఫిర్యాదులు స్వీకరించిన బీదా తాను ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళతామని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే రజనీకి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుతో తీవ్రమైన విభేదాలున్నాయి.
ఇప్పుడు ద్వితీయ శ్రేణి కేడర్ కూడా ఆమెపై కారాలు మిరియాలు నూరుతున్నారు. దీంతో జగన్కు వచ్చే ఎన్నికల్లో చిలకలూరిపేట టికెట్ వ్యవహారం తలనొప్పిగా మారే అవకాశముంది. ఏదేమైనా ఈ సారి రజనీకి చిలకలూరిపేటలో వ్యతిరేక పవనాలు సొంత పార్టీ నేతల నుంచే వీస్తున్నాయి.