ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీల దూకుడు.. ప్రభుత్వ వ్యతిరేకతపై జరుగుతున్న ప్రచారం విషయంలో ఆయా పార్టీలు దూకుడుగా ఉన్న విషయాన్ని సీఎం జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు తేల్చి చెప్పారు. ప్రతి ఒక్క విషయాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని.. దీనిని సమర్ధవంతంగా తిప్పికొట్టే యంత్రంగా మనం దగ్గర లేదా? ఉన్నా.. దానిని సద్వినియోగం చేసుకోలేక పోతున్నామా? అనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
తాజాగా ఎమ్మెల్యేలు, మంత్రులతో సీఎం జగన్ నిర్వహించిన సమావేశంలో ఈ విషయం స్పష్టంగా కనిపించింది. “ఇటీవల కాలంలో ప్రతిపక్షాల విమర్శలు మరింత పెరిగాయి. వచ్చే ఏడాది కాలంలో మరింతగా పెరుగుతాయి. ఇది నాకు మాత్రమే కాదు.. వ్యక్తిగతంగా మీకు కూడా మంచిది కాదు. దీనిని ఎందుకు సమర్ధవంతంగా తిప్పికొట్టలేక పోతున్నామో.. మనందరం ఆలోచించుకోవాలి. మీకు సమయం ఉంది.. అవకాశం ఉంది.. మరింత వేగంగా స్పందించాలి“ అని మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం జగన్ తేల్చి చెప్పారు.
అదేవిధంగా.. తన ఆందోళనను కూడా జగన్ వెల్లడించారు. “మనం చేసే మంచి కార్యక్రమాలకు.. వేగం తక్కువగా ఉంది. ఇదే నా ఆందోళన. మనం మంచి చేస్తున్నా.. దానిని చెప్పేందుకు ఓ వర్గం మీడియా వ్యతిరేకంగా ఉంది.. అయినా.. కూడా మనం వెనక్కి తగ్గడం లేదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. రేపు అధికారంలోకి రాకపోతే.. ఆ ఎఫెక్ట్ నాకన్నా.. మీపైనే ఎక్కువగా ఉంటుంది“ అని సీఎం చెప్పినట్టు సమాచారం.
ప్రతి నాయకుడు కూడా.. గడప గడప కార్యక్రమాన్ని మరింత తీవ్ర తరం చేయాలని.. ప్రజలను కలుసుకోవాలని.. వారి సమస్యలు పరిష్కరించాలని సీఎం జగన్ సూచించారు. ఆర్థికంగా ఉన్న సమస్యల విషయంలో ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని.. ఇతర సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించాలని.. అధికారులను సాధ్యమైనంత వేగంగా పనిచేయించేలా చూస్తే.. ప్రజల్లో వ్యతిరేకత తగ్గుతుందని కూడా ఆయన చెప్పారు. ఏదేమైనా జగన్లో అయితే ఆందోళన ఈ స్థాయిలో పెరగడం ఇప్పుడు వైసీపీ వర్గాల్లోనే చర్చనీయాంశంగా మారింది.