ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీకి ఇప్పుడుప్పుడే పట్టు దొరుకుతున్న విషయం తెలిసిందే. ఇంతకాలం జిల్లాలో వైసీపీ హవా నడుస్తోంది..ఇప్పుడు సీన్ మారుతూ ఉంది. టిడిపి బలపడుతుంది. దాదాపు సగం నియోజకవర్గాల్లో టిడిపి బలపడింది..గెలుపు అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. ఇదే సమయంలో ఆలూరు నియోజకవర్గంలో కూడా టిడిపికి పట్టు దొరికింది. ఎప్పుడో 1994 ఎన్నికల్లో ఇక్కడ టిడిపి గెలిచింది. మళ్ళీ ఎప్పుడు ఇక్కడ గెలవలేదు. వరుసగా కాంగ్రెస్ గెలవగా, గత రెండు ఎన్నికల్లో వైసీపీ గెలిచింది.
వైసీపీ నుంచి గుమ్మనూరు జయరాం వరుసగా గెలుస్తున్నారు. ఇప్పుడు మంత్రిగా ఉన్న ఆయనపై ప్రజా వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది. ఈ సారి ఎన్నికల్లో ఆయన గాని మళ్ళీ నిలబడితే గెలవడం కష్టమనే పరిస్తితి. ఇలాంటి తరుణంలో టిడిపికి గెలవడానికి మంచి అవకాశం దొరికిందని చెప్పవచ్చు. కాకపోతే టిడిపిలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. నేతల మధ్య ఆధిపత్య పోరు ఉంది.
ప్రస్తుతం అక్కడ టిడిపి ఇంచార్జ్ గా కోట్ల సుజాతమ్మ ఉన్నారు..కోట్ల ఫ్యామిలీకి నియోజకవర్గంపై పట్టు ఉంది…కానీ ఆమె పూర్తి స్థాయిలో టిడిపి క్యాడర్ ని కలుపుకుని వెళ్ళడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇదే సమయంలో అక్కడ మొదట నుంచి టిడిపికి అండగా వైకుంఠం ఫ్యామిలీ ఉంది. గతంలో వైకుంఠం శ్రీరాములు పార్టీ కోసం పనిచేశారు. కానీ ఫ్యాక్షన్ గొడవల్లో ఆయన చనిపోయారు. తర్వాత వైకుంఠం ఇద్దరు కుమారులు మల్లిఖార్జున్ చౌదరీ, శివప్రసాద్లు పార్టీ కోసం కష్టపడుతున్నారు.
అయితే ఎంత కష్టపడిన వారికి సీటు దక్కడం లేదు. ముఖ్యంగా మల్లిఖార్జున్ ఎన్ని ఇబ్బందులు ఎదురైన పార్టీని వదిలి వెళ్లలేదు..క్యాడర్ కోసం కష్టపడుతూనే ఉన్నారు. ఈ సారి ఎన్నికల్లో సీటు దక్కించుకోవాలని ఆయన చూస్తున్నారు. ఇక మెజార్టీ క్యాడర్ మల్లిఖార్జున్ వైపే చూస్తున్నారు. కానీ ఇటు కోట్ల సుజాతమ్మ ఉన్నారు. మరి వీరిలో బాబు ఎవరికి సీటు ఇస్తారనేది క్లారిటీ లేదు. అయితే ఈ పోరు వల్ల అనవసరంగా ఆలూరులో గెలుపు అవకాశం ఉన్నా సరే టిడిపికి దెబ్బపడేలా ఉంది.