ఏపీలో వచ్చే సాధారణ ఎన్నికల్లో చాలామంది వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు లేవు. ఈ విషయంలో వాళ్లకు కూడా ఓ క్లారిటీ వచ్చేసింది. ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే పనితీరు బాగోని ఎమ్మెల్యేలకు జగన్ వార్నింగ్ లు కూడా ఇచ్చేశారు. అయినా కొందరు ఎమ్మెల్యేల పని ఏమాత్రం మారటం లేదు. ఇక సమీకరణలతో పాటు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను జగన్ నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేయనున్నారు.
ముఖ్యంగా పార్టీ కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లాలో ఈసారి చాలామంది సిట్టింగులు మారిపోనున్నాయి.
ఇప్పటికీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి టికెట్లు లేవు అన్న విషయం క్లారిటీ వచ్చేసింది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు వైసిపికి దూరమయ్యారు. అలాగే ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పరిస్థితి కూడా అలాగే కనిపిస్తోంది. ఇక ఇప్పుడు ఈ లిస్టులో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ కూడా కనిపిస్తున్నారు.
అసలు గత ఎన్నికల్లోనే జగన్ ఈ సీటును గూడూరు నియోజకవర్గానికి చెందిన మేరుగ మురళికి ఇవ్వాలని అనుకున్నారు. అయితే తిరుపతి ఎంపీగా వరప్రసాద్ తాను అసెంబ్లీకి పోటీ చేస్తానని పట్టు పట్టడంతో జగన్ వరప్రసాద్ కు గూడూరు సీటు ఇవ్వగా ఆయన విజయం సాధించారు. ఇక ప్రస్తుతం మురళి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటుంది. దీనికి తోడు నియోజకవర్గంలో బలంగా ఉండి.. వైసిపికి ఎప్పుడు వెన్నుదన్నుగా ఉండే రెడ్డి సామాజిక వర్గానికి ఎంపీ వరప్రసాద్ కు కూడా పడటం లేదు.
దీంతోపాటు నియోజకవర్గంలో వరప్రసాద్ తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఇక ఇప్పుడు ఎమ్మెల్సీ మురళికి, వరప్రసాద్ కు కూడా తీవ్ర విభేదాలు కనిపిస్తున్నాయి. అసలు వరప్రసాద్ కు ఎస్సీ కోటాలో మంత్రి పదవి వస్తుందని అందరూ అనుకున్నారు. అయితే జగన్ రెండోసారి కూడా ఆయనకు ఛాన్స్ ఇవ్వలేదు. ఇక 2024 ఎన్నికల్లో ఆయనకు అసలు టిక్కెట్టే రాదని కూడా జిల్లా వైసీపీలో జోరుగా ప్రచారం నడుస్తోంది. ఏదైనా నెల్లూరు జిల్లాలో టిక్కెట్ రాని వైసిపి నేతల్లో వరప్రసాద్ కూడా దాదాపు చేరిపోయినట్టే.