దివంగత కాపు నేత వంగవీటి మోహనరంగా తనయుడుగా రాజకీయాల్లోకి వచ్చాడు. వంగవీటి రాధా 2004లో 25 సంవత్సరాల చిన్న వయసులోనే కాంగ్రెస్ నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆ తర్వాత రాధా మళ్ళీ అసెంబ్లీ ముఖం చూడలేదు. 2009లో ప్రజారాజ్యం నుంచి, 2014లో వైసిపి నుంచి ఓడిపోయారు. 2019 ఎన్నికలకు ముందు టీడిపి కండువా కప్పుకున్న రాధా ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ గెలుపు కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేశారు. పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.
పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో రాధా ఆశలు నెరవేరలేదు. గత కొంతకాలంగా రాధా సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు. దాంతో జనసేనలోకి వెళతారు అన్న ప్రచారం కూడా ఉంది. అయితే కొద్ది రోజుల క్రితం రాధా లోకేష్ ను కలిశాక ఆయన టీడిపిలోనే ఉంటారన్న క్లారిటీ అయితే వచ్చేసింది. చంద్రబాబు కూడా పార్టీని నమ్ముకున్న రాధాను వదులుకునేందుకు… రాధాకు అన్యాయం చేసేందుకు ఏమాత్రం సిద్ధంగా లేరు.
వచ్చే ఎన్నికలలో రాధాను కచ్చితంగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దించాలని బాబు డిసైడ్ అయిపోయారు. కొద్దిరోజుల క్రితం రాధా పేరు గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి అసెంబ్లీ రేసులో వినిపించింది.అయితే కృష్ణా జిల్లాలో పట్టున్న రాధాను అదే జిల్లా నుంచి ఎన్నికల బరిలోకి దించనున్నారు. రాధా కోసం చంద్రబాబు రెండు మూడు ఆప్షన్లు కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. మచిలీపట్నం నుంచి లోక్సభకు లేదా గన్నవరం, గుడివాడలో ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా రాధాను పోటీ చేయిస్తే ఎలా ? ఉంటుందన్న సమాలోచనలు చంద్రబాబు చేస్తున్నారు.
గన్నవరం, గుడివాడ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరు రాధాకు సన్నిహితులు. ఈసారి రాధాను ఈ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒకచోట పోటీ చేస్తే కాపు సామాజిక వర్గం ఓట్లతో పాటు టీడిపి ఓటు బ్యాంకు కలిస్తే ఈజీగా ఆ సీటును తమ ఖాతాలో వేసుకోవచ్చన్నదే చంద్రబాబు ప్లాన్ గా తెలుస్తుంది. అలాగే బందరు ఎంపీ సీటు నుంచి కూడా రాధా పేరు పరిశీలనలో ఉంది. ఏదేమైనా ఈసారి టీడిపి నుంచి రాధా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగటం అయితే ఖాయంగా కనిపిస్తోంది.