ఏపీలో అధికార వైసీపీ ఎమ్మెల్యేల్లో చాలామందికి నెక్స్ట్ ఎన్నికల్లో గెలుపు విషయం పై డౌట్ ఉందనే చెప్పాలి..కొందరికి గెలుపు విషయమే కాదు..సీటు విషయంలో కూడా డౌట్ ఉంది. ఇప్పటికే ప్రజా వ్యతిరేకత తెచ్చుకోవడం వల్ల కొందరు ఎమ్మెల్యేలకు సీటు ఇచ్చే ప్రసక్తి లేదని జగన్ చెప్పేస్తున్నారు. దీంతో చాలామంది ఎమ్మెల్యేల పరిస్తితి ఆగమ్యగోచరంగా తయారైంది. ఇదే క్రమంలో మంత్రి జోగి రమేష్ పరిస్థితి కూడా అర్ధం కాకుండా ఉందనే ప్రచారం వస్తుంది.
మంత్రిగా ఉన్నా సరే ఈయనకు సీటు విషయంలో కన్ఫ్యూజన్ ఉంది. ఈయన పెడన నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే జోగి సొంత నియోజకవర్గం మైలవరం. కానీ జోగి సొంత సామాజికవర్గం గౌడ ఓట్లు పెడనలో ఎక్కువ. అందుకే 2009లో అక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ ఐదేళ్లలో పెడనలో వ్యతిరేకత తెచ్చుకున్నారు.. దీంతో 2014లో అక్కడ పోటీ చేయకుండా సొంత స్థానం మైలవరంలో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
ఇక కాస్త గ్యాప్ రావడంతో మళ్ళీ 2019లో పెడన లో పోటీ చేసి వైసీపీ గాలిలో గెలిచారు. పైగా జనసేన ఓట్లు చీల్చడం జోగికి కలిసొచ్చింది. జోగి 7 వేల ఓట్ల తేడాతో టిడిపిపై గెలిస్తే..పెడనలో జనసేనకు 18 వేల ఓట్లు పడ్డాయి. అయితే ఈ సారి ఎన్నికల్లో టిడిపి-జనసేన కలిసేలా ఉన్నాయి..పైగా పెడనలో జోగికి వ్యతిరేకత ఎక్కువగానే ఉందని సర్వేలు చెబుతున్నాయి. పైగా మంత్రి అయ్యాక ఆయనకు పార్టీ కేడర్కు దూరం వచ్చిందంటున్నారు.
అదే సమయంలో సీటు విషయంలో జోగికి క్లారిటీ లేదు. అందుకే తన సొంత స్థానం మైలవరంపై ఫోకస్ పెట్టి.. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో ఆధిపత్య పోరుకు దిగారు. కానీ జగన్ క్లాస్ ఇవ్వడంతో వెనక్కి తగ్గారు. అలా అని పెడన సీటు దక్కుతుందనే గ్యారెంటీ లేదు..గతంలో ఉప్పాల రామ్ ప్రసాద్ ఫ్యామిలీకి జగన్ పెడన సీటు ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో జోగిని కైకలూరు పంపిస్తారనే చర్చ నడుస్తోంది. మొత్తానికి జోగి ఎటు చూసుకున్న రిస్క్ కనిపిస్తుంది.