తెలుగుదేశం పార్టీలో రాజకీయంగా ఎదిగి, అదే పార్టీలో రెండు సార్లు గెలిచి..ఆ తర్వాత వైసీపీలోకి జంప్ చేసి..రాజకీయ జన్మనిచ్చిన టీడీపీపైన విమర్శలు చేస్తున్న కొడాలి నాని, వల్లభనేని వంశీలకు చెక్ పడే దగ్గరపడినట్లు కనిపిస్తుంది. వైసీపీలోకి వెళ్ళాక వీరు ఏ స్థాయిలో చంద్రబాబుని బూతులు తిడుతూ వస్తున్నారో తెలిసిందే. ఇక ఇప్పుడు వారికి అన్నీ రివర్స్ అవుతున్నాయి.
తాజాగా చంద్రబాబు టూర్ గుడివాడలో సక్సెస్ అయిన విషయం తెలిసిందే..అక్కడ తెలుగు తమ్ముళ్ళు తమ సత్తా ఏంటో చూపించారు. ఈ ప్రభావం పక్కనే ఉన్న గన్నవరంపై కూడా పడింది. అక్కడ తనకు తిరుగులేదని అనుకుంటున్న వంశీకి రివర్స్ అయ్యే పరిస్తితి వచ్చింది. ఇప్పటికే వైసీపీలో వంశీకి వ్యతిరేకత ఉంది. యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రారావు లాంటి వారు వంశీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇంకా కొందరు కీలక నేతలు సైతం వంశీకి యాంటీగా ఉన్నారు.
ఇదే సమయంలో గత ఎన్నికల ముందు టిడిపి నుంచి వైసీపీలోకి వెళ్ళిన మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధన రావు..సైతం మళ్ళీ టిడిపి వైపుకు చూస్తున్నారు. అటు విజయా డెయిరీ ఛైర్మన్ అయ్యాక రాజకీయాలకు దూరమైన చలసాని ఆంజనేయులు సైతం టిడిపిలో యాక్టివ్ అవుతున్నారు. దాసరి 2009లో టిడిపి నుంచి గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే.
అయితే 2014లో వంశీకి సీటు ఇవ్వాలని చెప్పి..దాసరిని విజయా డెయిరీ ఛైర్మన్ చేశారు. దీంతో దాసరి అలా సైడ్ అయ్యారు. 2019 ఎన్నికల ముందు తన సోదరుడు దాసరి జై రమేష్ తో కలిసి వైసీపీలోకి వెళ్లారు. అప్పుడు వైసీపీ కోసం ప్రచారం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక వారికి ప్రాధాన్యత లేదు. మళ్ళీ వంశీని వైసీపీలోకి తెచ్చారు. దీంతో దాసరి టిడిపి వైపు చూస్తున్నారు. తాజాగా చంద్రబాబు గుడివాడ, నూజివీడు పర్యటన నేపథ్యంలో హనుమాన్ జంక్షన్ లో దాసరి ఫోటోలతో బాబుకు వెల్కం చెబుతూ ఫ్లెక్సీలు కట్టారు. అటు చలసాని అభిమానులు కూడా ఫ్లెక్సీలు కట్టారు.
అలాగే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఉంగుటూరు మండలంలో దాసరి స్వగ్రామమైన ఆముదాలపల్లిలో ఎన్టీఆర్ బసవతారకం దంపతుల విగ్రహాలతో కూడిన తారకమందిరాన్ని దాసరి కుటుంబ సభ్యులు భారీగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రారంభోత్సవానికి చంద్రబాబును, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను ఆహ్వానించినట్టు సమాచారం. మొత్తానికి గన్నవరంలో పాత నేతలు మళ్ళీ టిడిపిలోకి రావడానికి రెడీ అయ్యారు. దీంతో వంశీకి సీన్ రివర్స్ అయ్యేలా ఉంది.