ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో జోష్ సరిపోతుందా ? ఇంకా పెంచాలా ? ఇదీ.. ఇప్పుడు ఆసక్తిగా తమ్ముళ్లు చేస్తున్న చర్చ. ఒకవైపు.. టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్, మరోవైపు, పార్టీ అదినేత చంద్రబాబు నాయుడు.. రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. యువగళం పేరుతో నారా లోకేష్ చేస్తున్న పాదయాత్రకు భారీ ఎత్తున స్పందన వస్తోంది. యువత పెద్ద ఎత్తున పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు.
ఇక, చంద్రబాబు విడతల వారీగా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి రెండో విడత కార్యక్ర మం త్వరలోనే ప్రారంభించనున్నారు. అయితే.. ఈ మొత్తం ఎపిసోడ్ను గమనిస్తే.. టీడీపీలో జోష్ పెరిగిందనే చెప్పాలి. ఒకప్పుడు అంతా అయిపోయిందనే అధికార పార్టీ వైసీపీ ప్రచారానికి చంద్రబాబు తనదైన శైలిలో చెక్ పెట్టారు. దీంతో వైసీపీ కూడా.. ఇప్పుడు టీడీపీ పని అయిపోయిందని చెప్పడం లేదు.
పైగా.. ప్రతిపక్షాలను ఏకం చేస్తున్నారని చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం ప్రదర్శిస్తుండడం గమనా ర్హం. అంటే.. టీడీపీ పుంజుకుందనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. అయితే.. ఇప్పుడు ఉన్న విధంగా వచ్చే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందా ? అనేది ప్రశ్న. పార్టీ పుంజుకున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అనుకూలంగా లేదని అంటున్నారు పరిశీలకులు. తమ్ముళ్ల మధ్య వివాదాలు ఉన్నాయని చెబుతున్నారు.
అదే సమయంలో చాలా మందిలో మరో ప్రధాన సందేహం తారట్లాడుతోంది. తమకు టికెట్ వస్తుందా ? రాదా ? అనేది. దీనిపైనా.. చంద్రబాబు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. లేదా.. పరిస్థితిని చక్కదిద్దడమైనా చేయాలి. అదే సమయంలో నేతల మధ్య ఉన్న వివాదాలు.. విభేదాలను కూడా ఆయన తగ్గించే ప్రయత్నం చేయాలి.
అప్పుడు కానీ.. పార్టీ పూర్తిస్థాయిలో పుంజుకున్నట్టు కాదని.. పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఆదిశగా అడుగులు వేయాలని.. అప్పుడే పార్టీకి తిరుగు ఉండదని పరిశీలకులు సూచిస్తున్నారు.