రాజకీయాల్లో ప్రతిసారి అదృష్టం కలిసిరావడం అనేది కష్టమే…ఒకసారి అదృష్టం కలిసొచ్చినా..దాని ద్వారా ప్రజా బలం పెంచుకుంటే ఇబ్బందులు ఉండవు..అలాగే రాజకీయంగా విజయాలు దక్కుతాయి. కానీ ఎప్పుడు అదృష్టం దక్కాలంటే కష్టమే. అయితే గత ఎన్నికల్లో వైసీపీ నుంచి చాలామంది అదృష్టం కొద్దే గెలిచేశారని చెప్పవచ్చు. జనసేన ఓట్లు చీల్చడం, టిడిపిపై వ్యతిరేకత, వైసీపీ గాలిలో గెలిచారు.
అలా గెలిచిన వారు ప్రజల మద్ధతు పెంచుకుంటే ఇబ్బంది ఉండదు..అలా కాకుండా వ్యతిరేకత పెంచుకుంటే ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు కొందరు వైసీపీ ఎమ్మెల్యేలకు అదే పరిస్తితి వచ్చింది. అలా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి ఇబ్బందులు పెరిగాయి. ఈయన అదృష్టం ఏంటో గాని..రెండుసార్లు ఏదో సుడి ఉన్నట్లే గెలిచారు. 2014 ఎన్నికల్లో కేవలం 713 ఓట్ల తేడాతో ఈయన వైసీపీ నుంచి గెలిచారు. ఇక 2019 ఎన్నికల్లో జనసేన రూపంలో ఈయనకు అదృష్టం కలిసొచ్చింది.
వైసీపీ నుంచి మళ్ళీ బరిలో దిగి..టిడిపి నేత బండారు సత్యానందరావుపై కేవలం 4 వేల ఓట్ల తేడాతో గెలిచారు. అంటే వైసీపీ గాలి ఉన్నా సరే ఈయన తక్కువ మెజారిటీతోనే గెలిచారు. ఇక అక్కడ జనసేనకు 35 వేల ఓట్లు వరకు పడ్డాయి. అంటే టిడిపి-జనసేన కలిస్తే జగ్గిరెడ్డి పరిస్తితి ఏమయ్యేదో ఊహించుకోవచ్చు. అలా రెండుసార్లు అదృష్టం కొద్ది గెలిచినా సరే..ప్రజలకు మేలు చేసేలా పని చేసి..వారి బలం పెంచుకుంటే బాగానే ఉండేది.
కానీ జగ్గిరెడ్డి అలాంటిదేమీ చేయలేదు. అధికారంలో ఉండి కూడా కొత్తపేటకు చేసిందేమి లేదు..అభివృద్ధి శూన్యం..పైగా ఇక్కడ అక్రమాలు పెరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో జగ్గిరెడ్డిపై నెగిటివ్ ఎక్కువ ఉంది. ఈసారి ఆయనకు ఎలాంటి అదృష్టం కలిసొచ్చేలా లేదు. ఒకవేళ జనసేన విడిగా పోటీ చేసినా సరే..జగ్గిరెడ్డికి టిడిపి చేతులో ఓటమి వచ్చేలా ఉంది. ఇక టిడిపి-జనసేన కలిసి పోటీ చేస్తే ఇంకా డౌట్ లేకుండా జగ్గిరెడ్డికి పరాజయమే.