టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేస్తున్న పాదయాత్ర యువగళం. వచ్చే ఎన్నికల్లో పార్టీ సత్తా చాటడంతోపాటు.. యువతను పెద్ద ఎత్తున పార్టీవైపు ఆకర్షించే ఉద్దేశంతో చేపట్టిన ఈయాత్ర వాసత్వానికి ఆ ఉద్దేశంతోపాటు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు కూడా చేరువ అయ్యేందుకు ప్రయ త్నిస్తోంది. ఈ క్రమంలోనే నారా లోకేష్ అన్ని వర్గాలవారికీ చేరువ అవుతున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు.
ఇదిలావుంటే.. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో ఈ యువగళం పాదయాత్ర సాగుతోంది. వాస్తవానికి, కొన్నాళ్ల కిందటి వరకు ఇక్కడ ఒక సెంటిమెంటు తెరమీదికి వచ్చింది. కర్నూలును న్యాయరాజధాని చేయాలం టూ.. వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. తిరుపతిలోనూ కర్నూలును న్యాయ రాజధాని చేయాలంటూ.. లాయర్లు.. ఇతర వర్గాల ప్రజలతో సభలు నిర్వహించారు. దీంతో యువగళం పాదయాత్ర కర్నూలులోకి ప్రవేశించే విషయంలో టీడీపీ నేతలు ఒకింత గాభరా పడ్డారు.
యువగళం పాదయాత్రలో కర్నూలు న్యాయ రాజధాని మాట వినిపిస్తుందని అనుకున్నారు. కానీ.. ఎక్కడా కూడా.. ఈ మాట వినిపించలేదు. అంతేకాదు.. ఎవరూ కూడా కర్నూలును న్యాయరాజధాని చేయాలని చెప్పలేదు. అంతేకాదు.. కేవలం బెంచ్ను మాత్రమే ఇవ్వాలని కొందరు లాయర్లు .. నారాలోకేష్ను కలిసి విన్నవించారు. ఇక, ఇది ఎలాగూ.. టీడీపీ అధినేత చంద్రబాబు ఆది నుంచి చెబుతున్నదే.
హైకోర్టు అమరావతిలో ఉంటుందని.. సీమ ప్రజల సౌకర్యం కోసం కర్నూలులో ప్రత్యేకంగా హైకోర్టు బెంచ్ ను ఏర్పాటు చేస్తామని కొన్నాళ్ల కిందట తిరుపతిలో పర్యటించిన సమయంలోనూ చంద్రబాబు చెప్పారు. సో.. ఇప్పుడు కర్నూలును న్యాయరాజధాని చేయమనే డిమాండ్లు రాకపోవడం.. లాయర్లు సహా అందరూ బెంచ్ ఏర్పాటు చేయాలని విన్నవించిన నేపథ్యంలో చంద్రబాబు చెప్పిందే నిజం అవుతోందని అంటున్నారు పరిశీలకులు.