టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్లో ఎంత మార్పు.. ఎంత మార్పు.. ఇదీ. ఇప్పుడు రాజకీయ నేతలే కాదు.. రాజకీయ ఉద్ధండులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. నాలుగేళ్ల కిందటి వరకు పెద్ద గా దూకుడు లేదు. పైగా ఏం చేసినా.. ఏం మాట్లాడినా.. ప్రత్యర్థులకు ఆయన చిక్కిపోయారు. నోరు విప్పితే ఏం మాట్లాడతారో.. అని టీడీపీ నాయకులు కూడా బెంబేలెత్తారు. అలాంటి నారా లోకేష్ ఇప్పుడు పుంజు కున్నారు.
ఆయన ఏం మాట్లాడినా ఇప్పుడు సంచలనాలు. ప్రతి మాటా తూటాలాగా మారి ప్రత్యర్థులను నిలువునా వణికించే పరిస్థితి నెలకొంది. సీఎం జగన్ నుంచి వైసీపీ నాయకుల వరకు ఎవరినీ నారా లోకేష్ వదిలి పెట్టడం లేదు. ప్రస్తుతం నిర్వహిస్తున్న యువగళం పాదయాత్రలో నిప్పులు చెరుగుతున్నారు. సమస్య లపై తనదైన శైలిలో సటైర్లు వేస్తున్నారు. ఏ ప్రాంతంలో పాదయాత్ర నిర్వహిస్తే.. అక్కడ ఉన్న సమస్యలు, గత టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని కంపేర్ చేస్తూ.. నారా లోకేష్ విజృంభిస్తున్నారు.
వీటన్నింటికంటే కూడా.. విరామం లేకుండా సీఎం జగన్పై వేస్తున్న సటైర్లు.. జగన్ కు పెడుతున్న నిక్ నేమ్స్ వంటివి పెద్ద ఎత్తున యువతను ఆకర్షిస్తున్నాయి. అంతేకాదు, నియోజకవర్గాల్లో పర్యటించిన సందర్భంలో ఆయా ఎమ్మెల్యేల అవినీతి చిట్టాలను.. లెక్కల ప్రకారం బట్టబయలు చేస్తున్నారు. దీంతో నారా లోకేష్ యువగళం పాదయాత్రకు ఎనలేని స్పందన వస్తోంది. అసలు యువగళం ఈ రేంజ్లో పుంజుకుంటుందని కూడా ఎవరూ భావించలేదని కొందరు గుసగుస లాడడం వినిపిస్తోంది.
మరోవైపు.. డిజిటల్ మీడియాలోనూ టీడీపీ యువగళం సత్తా చాటుతోంది. రింగ్ టోన్ల రూపంలో యువగళం పాటలు మార్మోగుతున్నాయి. ఇక, యువగళం యాత్రలో యువత సంఖ్య పెరుగుతుండడం పార్టీ నేతలను ఉత్సాహానికి గురిచేస్తోంది. ఏదేమైనా ఎవరూ ఊహించని రీతిలో నారా లోకేష్ పాదయాత్ర పుంజుకోవడం.. ఆయన మాట తీరు, సటైర్లతో ఆకర్షించడం.. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.