ఏపీలో వైసిపిలో ఆ పార్టీ కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లాలోనే పెద్ద ముసలం మొదలైంది. ఇప్పటికే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కొద్ది నెలలుగా తమ అసమ్మతి గళం వినిపిస్తూ వస్తున్నారు. జగన్ కూడా వీరి నియోజకవర్గాలలో కొత్త నేతలకు పార్టీ పగ్గాలు అప్పగించి వీరికి పొమ్మనకుండా పొగ పెట్టేశారు. ఇక వీరికి తోడు ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సైతం ఎమ్మెల్సీ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ చేశారన్న అభియోగంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మొత్తం ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు. పార్టీ తమను సస్పెండ్ చేయడంతో ఈ ముగ్గురు సీనియర్ ఎమ్మెల్యేలు రగిలిపోతున్నారు.
పార్టీ అధిష్టానాన్ని టార్గెట్గా చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక నెల్లూరులో మొదలైన ఈ ముసలం ఇప్పుడు పక్కనే ఉన్న ప్రకాశం జిల్లాకు పాకేసింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రగిలిపోతున్నారు. రాంబాబు 2009లో ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో టీడిపి నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆయన.. 2019 ఎన్నికలకు ముందు వైసిపిలోకి వచ్చి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. రాష్ట్రంలోని పులివెందులలో జగన్ తర్వాత గిద్దలూరులోనే రాంబాబుకు ఏకంగా 81 వేల భారీ మెజార్టీ వచ్చింది. అంత భారీ మెజార్టీతో గెలిచిన రాంబాబుకు ఇప్పుడు వైసిపిలో ఒక్క పోత మొదలైంది.
గిద్దలూరు నియోజకవర్గం ముందు నుంచి రెడ్డి సామాజిక వర్గానికి కంచుకోటగా ఉంటూ వస్తుంది. వైసిపిలో అయితే ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు చెప్పినట్టే వినాలి. రాంబాబు తాను ఎమ్మెల్యేగా ఉన్న తన నియోజకవర్గంలో చిన్నచిన్న నామినేటెడ్ పదవులు కూడా తాను చెప్పిన వారికి ఇప్పించుకోలేని స్థితికి వచ్చేసారు. చివరికి గిద్దలూరు ఏఎంసీ చైర్మన్ కూడా జిల్లాకే చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పిన వారికి ఇచ్చారని రాంబాబు అప్పట్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు గిద్దలూరులో ఇప్పుడు రాంబాబు చెప్పిన పనులు కంటే బాలినేని చెప్పిన పనులు లేదా వైసిపి అధిష్టానం చెప్పిన పనులు మాత్రమే జరుగుతున్నాయట. పేరుకు మాత్రమే ఆయన ఎమ్మెల్యేగా ఉన్న ఆయన కోరలు పీకేసిన పాము మాదిరిగా మారిపోయారని జిల్లా వైసిపిలో చర్చి నడుస్తోంది. ఎన్నోసార్లు ఆయన బయటకు ప్రస్టేషన్ అయిపోయారు. తాజాగా తిరుమల దర్శనానికి వెళ్లిన రాంబాబు పరోక్షంగా టిటిడి చైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డిపై మండిపడ్డారు.
తిరుమలలో మీ వాళ్లకు.. మీ చుట్టాలకు ఒక చట్టం ఇతరులకు ఓ చట్టం.. టిటిడి మీ ఎస్టేట్ అనుకున్నారా ? సీఎంవో సిఫార్సులు కాదంటారా.. ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్తానంటూ అసహనం వ్యక్తం చేశారు. టిటిడి లో దర్శనాలు సౌకర్యాలు కల్పన, ప్రోటోకాల్ ప్రక్రియలో అధికారులు దుర్వినియోగం చేస్తున్నారంటూ రాంబాబు ఆరోపించారు. సుబ్బారెడ్డితో పాటు టిటిడి ఈవో ధర్మారెడ్డి పై కూడా రాంబాబు తన అసహనం వ్యక్తం చేశారు. అయితే దీనికి సుబ్బారెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. ఆ ఎమ్మెల్యే పరిమితికి మించి వీఐపీ దర్శనాల కోసం భక్తులను తీసుకు వచ్చారని.. అక్కడకు తాము 18 మందిని అనుమతి ఇచ్చామని చెప్పారు. ఏది ఏమైనా రాంబాబు కూడా పార్టీలో ఇమడలేకపోతున్నారని.. వచ్చే ఎన్నికలలో వైసిపి అధిష్టానం ఆయనకు సీటు కూడా ఇవ్వదని.. ఈ క్రమంలోనే ఆయన పార్టీలో ఉండాలా బయటకు రావాలా ? సీటు దక్కనప్పుడు పార్టీలో ఉండి ఉపయోగం ఏంటన్న ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.