ఏపీలో నెల్లూరు జిల్లాలో అధికార వైసిపిలో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఇదే జిల్లా నుంచి ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు ఎమ్మెల్యేలను పార్టీ సస్పెండ్ చేసింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ నుంచి వైసిపి సస్పెండ్ చేసింది. ఇక ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు వైసిపికి రెబల్ అయిపోయారు. పార్టీ తమను సస్పెండ్ చేయడంతో వీరు వైసిపి అధినేత జగన్ తో పాటు ఆ పార్టీ కిలకనేత సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్గా చేసుకుని విమర్శలు చేస్తున్నారు.
వైసిపిలో ఒక్కో ఎమ్మెల్యేకు ఎలాంటి అవమానాలు ? ఎదురవుతున్నాయో పూసగుచ్చినట్టు బయటపెడుతున్నారు. అయితే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు నెల్లూరు నగర ఎమ్మెల్యే మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికలలో కోటంరెడ్డి, ఆనం, మేకపాటికి ఓటమి తప్పదు అని.. వచ్చే ఎన్నికలలో ఈ ముగ్గురు గెలిచి అసెంబ్లీకి వస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటా… నేను గెలిచి అసెంబ్లీకి వస్తే మీరు రాజకీయాల నుంచి వెళ్లిపోతారా ? 2024 ఎన్నికల తర్వాత ఎవరు అసెంబ్లీకి వస్తారో తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరారు.
ఈసారి అనిల్ ను శాసనసభకు రానివ్వమంటూ కొందరు మంగమ్మ శపథాలు చేస్తున్నారు. వెళ్లిన ముగ్గురు ముందు గెలవండి… వచ్చే ఎన్నికలలో తాను జగన్ బొమ్మతోనే పోటీ చేస్తా గెలుస్తా ? దమ్ముంటే ఆపండి చూద్దాం అంటూ సవాల్ విసిరారు. వాస్తవంగా చూస్తే నెల్లూరు రూరల్ లో కోటంరెడ్డి బలమైన నేత ఆయనకు వ్యక్తిగత ఇమేజ్ ఉంది. అలాగే మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి కూడా జిల్లాలో బలమైన అనుచరగణం ఉంది. ఆయన ప్రభావం కనీసం నాలుగైదు నియోజకవర్గాలలో కనిపిస్తుంది.
విశ్వశనీయ వర్గాల సమాచారం ప్రకారం కోటంరెడ్డి, ఆనం టీడిపి నుంచి పోటీ చేసిన పక్కాగా గెలుస్తారని జిల్లా రాజకీయాల్లో ఇప్పటికే చర్చ ప్రారంభమైంది. ఇక ఉదయగిరిలో మాత్రం మేకపాటికి టీడిపి సీటు ఇవ్వకపోవచ్చు. ఆనం, కోటంరెడ్డి గెలిస్తే మరి అనిల్ రాజకీయాలనుంచి తప్పుకుంటారా అని కూడా ఈ ఇద్దరు నేతల అనుచరులు అనిల్ కు కౌంటర్లు వేస్తున్నారు. మరి అనిల్ గెలిచి ఈ ఇద్దరు నేతలు ఓడిపోతారా ? లేదా అనిలే ఓడిపోయి ఇద్దరు నేతలు గెలుస్తారా ? అన్నది వచ్చే ఎన్నికల్లో తేల్చాలి.