కృష్ణా జిల్లా అంటే ఒకప్పుడు టీడీపీ కంచుకోట అన్నట్లు ఉండేది..కానీ గత ఎన్నికల నుంచి పరిస్తితి మారిపోయింది. ఎప్పుడైతే టిడిపి ఘోరంగా ఓడిపోయిందో అప్పటినుంచి టిడిపికి కష్టాలు మొదలయ్యాయి. ప్రస్తుతానికి టిడిపి కొన్ని స్థానాల్లో పికప్ అయింది గాని..ఇంకా కొన్ని స్థానాల్లో బలపడాల్సిన అవసరం ఉంది. వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నా సరే టిడిపి పూర్తి స్థాయిలో పట్టు సాధించలేకపోతుంది. ఈ క్రమంలో ఈ నెల 12న నుంచి చంద్రబాబు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు.
జిల్లాలో పార్టీని బలోపేతం చేయడం, నాయకులు ఇంకా దూకుడుగా పనిచేసేలా దిశానిర్దేశం చేయనున్నారు. ఈ క్రమంలోనే 13న గుడివాడ నియోజకవర్గంలో భారీ సభ నిర్వహించనున్నారు. అక్కడ కొడాలి నానికి చెక్ పెట్టేలా టిడిపి ముందుకెళ్లడానికి చూస్తుంది. అయితే ఎంత చేసిన గుడివాడలో కొడాలి బలం తగ్గించలేని పరిస్తితి. పైగా అక్కడ టిడిపి సీట్ల కోసం నేతల మధ్య పోరు నడుస్తోంది. దీని వల్ల టిడిపికి మరింత ఇబ్బంది అవుతుంది.
పైగా గుడివాడలోనే కాదు,అటు పక్కన ఉన్న గన్నవరం, ఇటు పక్కన ఉన్న పామర్రులో టిడిపి బలపడటం లేదు. కొత్తగా ఏర్పడిన కృష్ణా జిల్లాలో టిడిపికి మచిలీపట్నం, పెడన, పెనమలూరు, అవనిగడ్డ స్థానాల్లోనే బలం కనిపిస్తుంది. గుడివాడ, గన్నవరం, పామర్రులో వీక్ గా ఉంది. దీంతో ఇప్పుడు బాబు గుడివాడలో పర్యటించనున్నారు. దీని వల్ల జిల్లాలో టిడిపికి కాస్త ఊపు వస్తుందనే చెప్పవచ్చు.
అలాగే గుడివాడలో కూడా టిడిపి బలం ఇంకా పెరగాల్సి ఉంది. అలాగే అక్కడ సరైన నాయకుడుని అభ్యర్ధిగా ఫిక్స్ చేయాల్సి ఉంది. అప్పుడే కొడాలికి చెక్ పెట్టవచ్చు. ఇటు గన్నవరంలో కూడా టిడిపికి సరైన అభ్యర్ధి లేరు. మరి జిల్లా పర్యటనకు వచ్చే బాబు..ఈ నియోజకవర్గాలని సెట్ చేస్తారేమో చూడాలి.