ఏపీలో అధికార వైసిపి గత ఎన్నికలలో ఏకంగా 151 స్థానాలలో అప్రతిహత విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. జగన్ సాధించిన ఈ విజయం తిరుగులేని ఘనవిజయం. అయితే ఈ నాలుగేళ్లలో చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల నుంచే తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. కొన్నిచోట్ల గ్రూపు రాజకీయాలు.. మరికొన్నిచోట్ల ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేకపోవడం.. మరికొన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకు పార్టీలోని నాయకులకు మధ్య సరైన సఖ్యత లేకపోవడం.. మరి కొన్నిచోట్ల ఎమ్మెల్యేలకు, అధిష్టానానికి గ్యాప్ రావడం ఇలా చాలా కారణాలతో ఈసారి కొందరు ఎమ్మెల్యేలకు టికెట్లు వచ్చే పరిస్థితి లేదు.
అలాగే మరికొందరు ఎమ్మెల్యేలు గెలిచే పరిస్థితి కూడా లేదు. గత ఐదారు నెలలుగా వచ్చే ఎన్నికలలో జగన్ ఏకంగా 50 నుంచి 70 మంది సిట్టింగ్లను పక్కన పెట్టేస్తారని… వారి స్థానాల్లో కొత్త వ్యక్తులకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారం సంగతి ఎలా ? ఉన్నా నిన్న ఎమ్మెల్యేలు, మంత్రులతో జగన్ నిర్వహించిన సమావేశం తర్వాత 15 నుంచి 20 మందికి మాత్రమే వచ్చే ఎన్నికలలో సీట్లు ఉండవని,, మిగిలిన వారందరినీ జగన్ కంటిన్యూ చేసే ఉద్దేశంతో ఉన్నారని వైసిపి వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఈ లిస్టులో ఒక ఉత్తరాంధ్ర నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలకు ఈసారి టిక్కెట్లు వచ్చే అవకాశాలు లేవని ప్రచారం జరుగుతుంది. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలకు సీట్లు రావని… ఆ పేర్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి పలాస ఎమ్మెల్యే మంత్రి అప్పలరాజుకు వచ్చే ఎన్నికలలో టిక్కెట్ దక్కదని ప్రచారం జరుగుతుంది.
అలాగే రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, బొబ్బిలి ఎమ్మెల్యే చిన అప్పలనాయుడు యలమంచిలి ఎమ్మెల్యే ఉప్పలపాటి వెంకటరమణ మూర్తి రాజు, పెందుర్తి ఎమ్మెల్యే అన్నపురెడ్డి అదీప్ రాజు, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు లకు టికెట్లు ఇవ్వనని జగన్ చెప్పినట్టు ప్రచారం అయితే గట్టిగా జరుగుతోంది. ఏది ఏమైనా ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టు 60 – 70 మంది ఎమ్మెల్యేలకు కాకపోయినా ఖచ్చితంగా 20 – 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి జగన్ కచ్చితంగా సీట్లు ఇచ్చే అవకాశం అయితే లేదు.