తెలుగుదేశం పార్టీతో కలిసి నడిచేందుకు బిజెపి ప్రయత్నాలు మొదలుపెట్టేసిందా ? అందుకే ముందుగా తెలంగాణలో పొత్తు పెట్టుకోవడానికి సంకేతాలు పంపుతుందా ? అంటే జాతీయ రాజకీయ వర్గాలు.. ఢిల్లీ వర్గాల సమాచారం ప్రకారం అవునని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ప్రయత్నాలు ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చాయని కూడా చెబుతున్నారు. బిజెపి ఆర్ఎస్ఎస్ లోని స్లీపర్సెల్స్ కూడా టిడిపితో పొత్తుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై కూడా బిజెపిలోని కొందరు కీలక నేతలు టిడిపితో కలిసి వెళ్లాలని ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోనూ పొత్తు పెట్టుకునే దిశగా బీజేపీ పెద్దలు ఢిల్లీ స్థాయిలో పెద్ద ఎత్తున ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. గత ఎన్నికలకు ముందు నుంచే టిడిపి – బిజెపి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం ఉంది.
అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీతో కలిసి వెళితేనే బాగుంటుందన్న నివేదికలు.. ఇంటెలిజెన్స్ రిపోర్టులు మోడీ – అమిత్ షా వద్దకు చేరడంతో.. ఇప్పుడు వారిద్దరు కూడా తెలుగుదేశంతో కలిసి వెళితేనే ఏపీలో బిజెపి బతికి బట్ట కడుతుందని.. ఒంటరిగా పోటీ చేసినా జనసేనతో కలిసి వెళ్లిన అసలు గెలవడం కాదు కదా .. పరువు కూడా పోయే పరిస్థితి ఉందన్న విషయంపై వాళ్లకు క్లారిటీ వచ్చేసింది.
ఈ క్రమంలోనే సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి నేతలు కూడా ఆంధ్రాలో బిజెపి పరిస్థితి.. తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్లే ఆవశ్యకతను పదేపదే గుర్తు చేస్తూ వస్తున్నారు. దీంతో తాము టిడిపిని వదులుకొని తప్పు చేశామన్న అభిప్రాయానికి బిజెపి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ముందుగా తెలంగాణలో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న మోడీ అక్కడ ఆ పార్టీకి ఉన్న ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొని ముందు తెలంగాణ ఎన్నికలలో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని.. ఆ తర్వాత ఆంధ్ర ఎన్నికలలో కలిసి వెళ్లేలా చర్చలు అయితే నడుస్తున్నాయని తెలుస్తోంది.
ఏది ఏమైనా ఇటు ఆంధ్ర అటు తెలంగాణలో తెలుగుదేశం సత్తా ఏంటో మోడీకి ఇప్పుడు తెలిసి వచ్చిందని.. అందుకే టిడిపి తో పొత్తు కోసం మళ్లీ పార్టీ నేతల ద్వారా సంకేతాలు పంపుతున్నారని తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలలో బిజెపి జాతి అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలకు కూడా అభినందనలు తెలియజేశారు. అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు కూడా అర్పించారు.
అలాగే నడ్డా – వాజ్పేయి, ఎన్డీఏ హయంలో టిడిపి – బిజెపి మధ్య ఉన్న అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. ఇక ఇటీవల అండమాన్ ఎన్నికలలో తెలుగుదేశం బిజెపి పొత్తుపైనా ఆయన ట్వీట్ చేయడంతో ఈ రెండు పార్టీల మధ్య బంధం కొత్తగా చిగురుస్తుందన్న సంకేతాలు అయితే బలంగా వినిపిస్తున్నాయి.