వైసీపీలో అత్యంత కీలకమైన సమావేశం నిన్న జరిగింది. ఈ సమావేశానికి కొందరు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా హాజరు కాలేదు. ఇది ఇలా ఉంటే టిక్కెట్లు కేటాయింపు పై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇప్పటివరకు 50 నుంచి 70 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు రావని ప్రచారం జరిగింది. ఇక గడపగడపకు మన ప్రభుత్వం సమీక్షలో భాగంగా వడపోస్తూ వచ్చిన వైసీపీ అధిష్టానం చివరకు 15 మంది ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. మొత్తం 15 మంది ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చే అవకాశాలు లేవని సోషల్ మీడియా వర్గాలలో ప్రచారం జరుగుతుంది.
ఇందుకు సంబంధించిన పేర్లు కూడా బయటకు వచ్చేసాయి. ఈ 15 మందిలో ముగ్గురు మంత్రుల పేర్లు కూడా ఉండటం విశేషం. ఇక వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యే టికెట్లు రావని ప్రచారం జరుగుతున్న వారిలో ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి నలుగురు ఎమ్మెల్యేల పేర్లు బయటికి వచ్చాయి. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ – సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు – మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి – కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ ఉన్నారు.
అలాగే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని – కడప జిల్లా నుంచి మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి – అనంతపురం జిల్లా నుంచి మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామిలకు వచ్చే ఎన్నికలలో టిక్కెట్ తక్కదని ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే జగన్ తనకు వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని కూడా ఈ సమావేశంలో క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. మంత్రులు అయినా.. ఎవరైనా ప్రజల్లో సానుకూల వాతావరణం లేకపోతే వారికి టిక్కెట్ ఇచ్చేది లేదని కూడా తెగేసి చెప్పినట్టు తెలుస్తుంది.
ఇక టిక్కెట్టు డౌట్గా ఉన్న మంత్రులలో అమలాపురం ఎమ్మెల్యే మంత్రి పినిపే విశ్వరూప్ – వేమూరు ఎమ్మెల్యే మంత్రి మేరుగ నాగార్జున – పలాస ఎమ్మెల్యే మంత్రి సీదిరి అప్పలరాజు పేర్లు కూడా ఉన్నాయి. అయితే ఈ పేర్లు నిజమా లేదా కేవలం ప్రచారమా ? అన్నది తెలియాల్సి ఉంది అయితే ప్రజల్లో వీరి గ్రాఫ్ తక్కువగా ఉన్న నేపథ్యంలో మెరుగుపరుచుకోవాలని జగన్ ఇలా పరోక్షంగా హింట్ ఇచ్చారనే ప్రచారం కూడా వైసిపి వర్గాల్లో జరుగుతోంది.