సమైక్యాంధ్రలో మంత్రిగా పనిచేసిన సీనియర్ కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి చాలా రోజుల తర్వాత ఇప్పుడు రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ పూర్తిగా గల్లంతు అయింది. అయినా కూడా గత రెండు ఎన్నికలలో ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. 2014లో పెనుగొండ నుంచి పోటీ చేసి మంచి ఓట్లు సొంతం చేసుకున్నారు. ఇక 2019 ఎన్నికలలో తన సొంత నియోజకవర్గం (2009లో గెలిచిన) కళ్యాణదుర్గం నుంచి కూడా పోటీ చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని.. ఆయన సమకాలిన నేతలు అందరూ టిడిపి, వైసిపి, జనసేనలో చేరిపోయారు.
ఇంకా రఘువీరా మాత్రం ఆ కాంగ్రెస్నే పట్టుకునే వేలాడుతున్నారు. తాజాగా రఘువీరా కర్ణాటక కాంగ్రెస్ ఎన్నికల ఇన్చార్జిగా వెళ్లారు. కర్ణాటకలో కాంగ్రెస్ కచ్చితంగా విజయం సాధిస్తుందని జోస్యం చెబుతున్నారు. ఇదిలా ఉంటే కర్ణాటక ఎన్నికల తర్వాత ఆయన తన రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారిపోతారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఆయనకు సన్నిహితుడుగా ఉన్న సమైక్యాంధ్ర చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బిజెపి కండువా కప్పుకున్నారు.
వాస్తవంగా చెప్పాలి అంటే రఘువీరా పార్టీ మారాలనుకుంటే వైసీపీలో ఆయనకు రెడ్ కార్పెట్ వేస్తారు. అయితే ఆ పార్టీలోకి వెళ్లడం ఆయనకు ఇష్టం లేదని తెలుస్తోంది. వైఎస్ఆర్ చనిపోయిన వెంటనే జగన్ను ముఖ్యమంత్రిని చేయాలని ఎమ్మెల్యేల సంతకాల సేకరణ కార్యక్రమానికి రఘువీరా నాయకత్వం వహించారు. అయితే అలాంటి జగన్ పంచిన చేరేందుకు రఘువీరా ఇష్టపడటం లేదట.
ఈ క్రమంలోనే ఆయన చంద్రబాబు నాయకత్వంలో పనిచేయటానికి ఇష్టపడుతున్నారని.. త్వరలోనే టిడిపి కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. టీడీపీలో చేరితే ఆయనకు అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం లేదా పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏదో ఒక సీటు ఇస్తారని టాక్ ? ఏది ఏమైనా రఘువీరా కాస్త గ్యాప్ తర్వాత రాజకీయంగా యాక్టివ్ కాబోతున్నారు.