ఔను.. ఇటీవల కాలంలో వైసీపీ వరుస వివాదాల్లో చిక్కుకుంది. దీంతో పార్టీకి డేంజర్ బెల్స్ మోగుతున్నా యనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. విశాఖ ఉక్కు నుంచి కోడికత్తి కేసు వరకు.. ఆసాంతం పార్టీని డిఫెన్స్లో పడేసింది. విశాఖ ఉక్కు పరిశ్రమను వేలం వేస్తున్నామని .. కేంద్రం ఇంకా ప్రకటించక ముందే.. పొరుగు రాష్ట్రం తెలంగాణ జోక్యం చేసుకుంది. మేం పాల్గొంటున్నాం.. అనిప్రకటించింది.
ఇది.. వైసీపీకి తీవ్ర విఘాతంగా మారింది. నిజానికి ఇదే ఘటన తెలంగాణలో జరిగి, ఏపీ ప్రభుత్వం ఇలానే జోక్యం చేసుకుంటే.. తెలంగాణ ప్రభుత్వం ఊరుకుంటుందా? నిప్పులు చెరగదా? అనే చర్చ తెరమీదికి వచ్చింది. కానీ, వైసీపీ మాత్రం సైలెంట్ అయిపోయింది. మంత్రులకు పగ్గాలు అప్పగించినా.. వారు వ్యక్తిగత విమర్శలు చేయడంతో చర్చ ట్రాక్ తప్పేసింది. దీంతో తెలంగాణ దూకుడుకు వైసీపీ పగ్గాలు వేయలేక పోయిందనేది ఒక చర్చ.
మరోవైపు.. ఏపీ ప్రజలకు కూడా బీఆర్ ఎస్ మాత్రమే దిక్కు అనేలా.. ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రచారానికి కౌంటర్ ఇవ్వడంలోనూ వైసీపీ విఫలమైందనే వాదన వినిపిస్తోంది. అసలు రాష్ట్రాన్ని విభజించేందుకు కారణమైన బీఆర్ ఎస్ నేతలు.. ఇప్పుడు ఏపీకి ఏదో చేస్తామని చెబుతున్నా.. ఏపీ ప్రజలకు తాము తప్ప ఎవరూ దిక్కులేరని అంటున్నా వైసీపీ నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారనేది ఇప్పుడు ప్రశ్న.
ఇక, ఏదో జరుగుతుందని అనుకున్న కోడికత్తి కేసులోనూ వైసీపీకి భారీ ఎదురు దెబ్బతగిలింది. దీనిలో ఆది నుంచి కూడా వైసీపీ నేతలు.. టీడీపీ ప్రమేయం ఉందని.. కుట్ర చేశారని ఆరోపిస్తూ వచ్చారు. కానీ, దర్యాప్తు సంస్థ ఎన్ ఐఏ మాత్రం ఎలాంటి కుట్ర లేదని, అసలు టీడీపీకి సంబంధమే లేదని సర్టిఫికేట్ ఇవ్వడం ద్వారా.. వైసీపీని మరింత అఘాతంలోకి నెట్టినట్టయింది. దీంతో వైసీపీ ఈ రెండు విషయాల్లో నూ.. విఫలమైందనే వాదన వినిపిస్తోంది. అంటే.. ఇప్పటి వరకు ఉన్న సింపతీ పవనాలు గాలికి కొట్టుకుపోయినట్టేననే చర్చ సాగుతోంది.