ఏపీలో ఇప్పటికే 265 జిల్లాలు ఉన్నాయి. గతంలో 13 గా ఉన్న జిల్లాలను వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 26 జిల్లాలుగా మార్చింది. జగన్ గత ఎన్నికలకు ముందే ప్రతి లోక్సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అయితే అరకు పార్లమెంటు నియోజకవర్గం చాలా పొడవుగా ఉండడంతో పాలనా పరంగా ఇబ్బంది లేకుండా ఉండేందుకు పార్వతీపురం.. అరకు జిల్లాలుగా విభజించారు.
అయితే రంపచోడవరం, పోలవరం నియోజకవర్గాలను కలుపుతూ పోలవరం కేంద్రంగా మరో కొత్త జిల్లా ఏర్పాటు చేసే ఆలోచన కూడా చేస్తున్నారు. ఇదిలా ఉంటే టిడిపి అధినేత చంద్రబాబు పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీలో మరో కొత్త జిల్లా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చేశారు. ఆ జిల్లా ఏదో కాదు ఒంగోలు జిల్లా నుంచి కొత్తగా మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేస్తామని బాబు తెలిపారు.
తాజాగా నెల్లూరులో జోన్ 4 సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మార్కాపురం నియోజకవర్గ నాయకులు మాట్లాడుతూ టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయడంతో పాటు వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలని కోరారు. వెంటనే స్పందించిన చంద్రబాబు తప్పకుండా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేసే బాధ్యత నాది అని.. అలాగే వెలిగొండ ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తాం అని వివరించారు.
ప్రస్తుతం మార్కాపురం జిల్లా ఒంగోలు జిల్లాలో కలిసి ఉంది. అయితే మార్కాపురం నుంచి ఒంగోలు రావాలంటే దాదాపు 120 నుంచి 150 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంది. ఈ ఇబ్బంది కలిగించేందుకు మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయాలని.. ఆ పశ్చిమ ప్రాంత వాసులు కోరినా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇక ఇప్పుడు దీనిపై చంద్రబాబు హామీ ఇచ్చారు. మార్కాపురం – గిద్దలూరు – ఎర్రగొండపాలెం నియోజకవర్గాలను కలుపుతూ ఈ కొత్త జిల్లా ఏర్పాటు కానుంది.