టాలీవుడ్ లో మరో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమా రానుందా ? ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించ నున్నారా ? అంటే అవునని సమాధానం వస్తుంది. ఈ ఇద్దరిలో ఒకరు నందమూరి నట వారసుడు కాగా.. మరొకరు మెగా ఫ్యామిలీ హీరో. ఆ ఇద్దరు హీరోలు ఎవరో కాదు.. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. వీరిద్దరూ కలిసి భారీ మల్టీస్టారర్ సినిమాలో నటించేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే నందమూరి, మెగా కాంపౌండ్ హీరోలుగా ఉన్న ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి రాజమౌళి దర్శకత్వంలో త్రిబుల్ ఆర్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.
ఇక తాజాగా వీరిద్దరి కాంబినేషన్ కాకుండా… మరోసారి మెగా – నందమూరి కాంబినేషన్ రిపీట్ కానున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఆదిత్య థార్ దర్శకత్వం వహించే ఈ సినిమా పౌరాణిక నేపథ్యంలో ‘ ఇమ్మోర్టల్ అశ్వత్థామ ’ అనే సినిమా రూపొందించేందుకు ఆదిత్య ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, బన్నీ హీరోలు అయితే బాగుంటుందని ఆదిత్య భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాను జియో స్టూడియోస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఇప్పటికే మేకర్స్ ఈ విషయమై ఎన్టీఆర్, అల్లు అర్జున్ను సంప్రదించగా… వారు కూడా ఓకే చెప్పారని… దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇక తొలుత ఈ సినిమా కోసం విక్కీ కౌశల్, రణ్వీర్ సింగ్ పేర్లు పరిశీలించినట్లు వార్తలు వచ్చాయి.
అయితే ఈ సినిమాకు సౌత్ ఇండియాలోనూ మార్కెట్ జరగాలన్నా.. పాన్ ఇండియా క్రేజ్ రావాలన్నా బన్నీ, ఎన్టీఆర్ అయితేనే కరెక్ట్ అని చివరకు వారిద్దరిని ఫైనలైజ్ చేసినట్టు తెలుస్తోంది. బన్నీ, ఎన్టీఆర్ మల్టీస్టారర్ అంటే టాలీవుడ్ మరోసారి షేక్ అవ్వడం ఖాయం. బన్నీ ప్రస్తుతం పుష్ప2 షూటింగ్లో బిజీగా ఉండగా, ఎన్టీఆర్ కొరటాల డైరెక్షన్లో ఓ సినిమాలో నటిస్తున్నాడు.