తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం తెలుగుదేశం పార్టీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న మద్దిపాటి వెంకటరాజుకు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పగ్గాలు అప్పగించినప్పటి నుంచి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రెండు గ్రూపులుగా చీలిపోయింది. మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు ఒక వర్గం గాను.. మద్దిపాటి వర్గం వారు మరో గ్రూపుగా ఉంటున్నారు. నియోజకవర్గంలోని 4 మండలాల్లో పార్టీ క్యాడర్ అంతా ఇప్పటివరకు సమన్వయంతో పనిచేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.
మరీ ముఖ్యంగా బాపిరాజు, వెంకటరాజు మధ్య సమన్వయం పూర్తిగా కొరవడింది. వెంకటరాజు ..బాబిరాజుతో సఖ్యతతో ఉండేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనకు నియోజకవర్గ ఇన్చార్జి పగ్గాలు అప్పగించినప్పటి నుంచి బాపిరాజును పదేపదే కలుస్తూ.. ఆయనతో కలిసి పని చేసేందుకు ఆసక్తి చూపిస్తూ వచ్చారు. అయితే బాపిరాజు వెంకట్రాజుతో కలిసి రాజకీయం చేసేందుకు సుముఖతతో లేరు.
ఓవైపు నియోజకవర్గ ఇన్చార్జిగా పార్టీ కార్యకర్తలను ఒంటి చేత్తో ముందుకు నడిపిస్తున్నారు వెంకటరాజు. అయితే నియోజకవర్గంలోని 4 మండలాలకు చెందిన కొందరు నేతలు ఇప్పటివరకు నియోజకవర్గ ఇన్చార్జ్గా ఉన్న వెంకటరాజుతో సంబంధం లేకుండా అడపాదడపా కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చారు. ముప్పిడికి ఎమ్మెల్యే సీటు ఇవ్వాల్సిందే అని ఇంకా నినందిస్తున్నారు. అయితే చంద్రబాబు పలుమార్లు వెంకటరాజే పోటీ చేస్తారని క్లారిటీ ఇచ్చారు. పోలవరం పర్యటనకు వచ్చినప్పుడు నియోజకవర్గంలోని దొండపూడిలో కూడా వెంకటేశ్వరరావు గారి భవిష్యత్తుకు హామీ నాది.. మీరు వెంకటరాజు గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని పబ్లిక్గానే వెంకట్రాజుదే సీటు అని క్లారిటీ ఇచ్చేశారు.
సీన్ మద్దిపాటికి వన్ సైడ్ అవుతోందా…!
సాధారణ ఎన్నికలకు మరో ఎనిమిది నెలల సమయం ఉండగా నియోజకవర్గంలో తెలుగుదేశం రాజకీయం ఒక్కసారిగా మారుతోంది. వెంకట్రాజు మొక్కోవని దీక్షతో.. పార్టీ పట్ల కసితో చేస్తోన్న పోరాటానికి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు విపక్ష వైసీపీని అభిమానించిన వారి నుంచి కూడా అనూహ్యంగా మద్దతు లభిస్తోంది. యువకుడు, ఉన్నత విద్యావంతుడు కావడంతో పాటు చంద్రబాబు, లోకేష్కు ఇష్టుడు కావడంతో ఆయన్ను అసెంబ్లీకి పంపిస్తే వెనకపడిన గోపాలపురం నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందన్న ఆశలు వారిలో చిగురిస్తున్నాయి.
ఈ క్రమంలోనే పార్టీలోనే కొన్ని వర్గాల నుంచి సహకారం లేకున్నా మద్దిపాటి వెంకటరాజు చేస్తోన్న పోరాటినికి పార్టీ అభిమానుల నుంచి అనూహ్య మద్దతు దక్కుతోంది. నిన్న మొన్నటి వరకు ముళ్ళపూడి, ముప్పిడికి జై కొట్టిన నేతలు, కార్యకర్తలు చాలామంది ఇప్పుడు మద్దిపాటి వైపు మొగ్గు చూపుతున్నారు. నియోజకవర్గానికి చెందిన పలువురు కీలక నేతలు, అనుబంధ విభాగాల నేతలతో మాట్లాడినప్పుడు బాపిరాజు, ముప్పిడి అంటే మాకు ఇష్టం అయితే చంద్రబాబు నిర్ణయం మేరకు వెంకటరాజుకే మా సపోర్ట్ .. పార్టీకి మేం ఎప్పుడూ అన్యాయం చేయం అని చెప్పేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ సైకిల్ సింబల్ కు కాదని.. కన్నతల్లి లాంటి పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే ప్రసక్తే ఉండదని తేల్చిచెపుతున్నారు. అయితే వెంకటరాజు, బాపిరాజు, ముప్పిడి కలిసి పనిచేస్తే నియోజకవర్గం లో పార్టీ మరింత బలంగా ఉంటుందని… అసలు తెలుగుదేశం పార్టీని ఎవరు టచ్ చేసే సాహసం కూడా చేయరు అన్నదే మా ఆశ అని వీరంతా చెపుతున్నారు.
విచిత్రం ఏంటంటే ముళ్లపూడి, ముప్పిడి వర్గంలో ఉన్న నేతలు కూడా చివరి వరకు ముప్పిడికి టిక్కెట్ ఇవ్వాలని పోరాడతాం.. అయితే ముప్పిడికి టిక్కెట్ రాకపోయినా మద్దిపాటిని బంపర్ మెజార్టీతో గెలిపించి గోపాలపురం సీటును చంద్రబాబుకు కానుకగా ఇస్తామని వారే చెపుతుండడం విశేషం. ద్వారకాతిరుమల, నల్లజర్ల మండలాల్లో బాపిరాజు, ముప్పిడి వెనకాల తిరుగుతోన్న నేతలు కూడా పార్టీకి ద్రోహం చేసే ప్రశక్తే ఉండదని చెపుతున్నారు. మామా పంచాయతీల్లో పార్టీ బలం ఏంటో ఎన్నికల్లోనే చూపిస్తామంటున్నారు.
ఒకరిద్దరు మాత్రం ముప్పిడి భవిష్యత్తు నాదంటూ చంద్రబాబు హామీ ఇచ్చారని.. అలాగే బాపిరాజు విషయంలో కూడా బాబు బహిరంగంగానే ఓ క్లారిటీ ఇస్తే అప్పుడు ఈ త్రిమూర్తుల కూటమితో మద్దిపాటి గెలుపు, మెజార్టీతో తాడేపల్లి ప్యాలెస్ రీ సౌండ్తో అదిరిపోయేలా తీర్పు ఇస్తామని కూడా పార్టీ నేతలు చెపుతున్నారు. ఏదేమైనా గోపాలపురం టీడీపీలో నేతలు, కార్యకర్తల మధ్య సఖ్యతలో చిన్న చిన్న అరమరికలు ఉన్నా ఓటరు, తెలుగుదేశం వీరాభిమాని మాత్రం సైకిల్ సింబల్పై ఓటు గుద్ది బంపర్ విక్టరీ కొట్టించే విషయంలో అయితే పక్కాక్లారిటీతోనే ఉన్నాడు.