ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల వేళ అధికార వైసిపికి అదిరిపోయే షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు టీడిపి అభ్యర్థికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేశారు. వాస్తవానికి ఎవరెవరు ? ఈ క్రాస్ ఓటింగ్ చేశారన్నది పక్కన పెడితే వైసిపి మాత్రం తమకు అనుమానంగా ఉన్న నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే గత సాధారణ ఎన్నికల తర్వాత టీడిపికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి దూరం జరిగి వైసిపి చెంత చేరిపోయారు.
అలాగే జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద రావు కూడా జగన్ చెంత చేరిపోయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే రాపాక ఒక్కసారిగా జూలు విదిల్చారు. వైసిపి నుంచి సస్పెండ్ అయిన నలుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీ నాయకత్వం మధ్యలో నలుగుతున్న గొడవలో దూరి కాళ్లు, వేళ్ళు పెట్టేశారు. ఆ మాటకు వస్తే టీడిపి వాళ్ళు నా దగ్గరికి వచ్చారు.. మిత్రుడు కే ఎస్ ఎన్ రాజు ద్వారా నాతో మధ్యవర్తిత్వం చేయించారు.
నాకు కూడా రూ. 10 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారంటూ ఆరోపించారు. దీంతో టీడిపి నేతలు రాపాకపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. టీడిపి పొలిటి బ్యూరో మెంబర్ బోండా ఉమామహేశ్వరరావు రాపాకను ఓ ఆట ఆడుకున్నారు.నువ్వు ఆల్రెడీ పది కోట్లకు అమ్ముడుపోయిన ఎమ్మెల్యేవి. అయినా నువ్వు పదివేల రూపాయల విలువ కూడా చేయవు. నిన్ను ఎవరైనా రూ.10 కోట్లు పెట్టి కొనడానికి సిద్ధంగా ఉంటారా ? అంటూ బోండా రాపాకను ఎక్కడ గుచ్చాలో.. అక్కడ గుచ్చేశారు.
తమ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం కావలసిన 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినా మాకు గెలుపు కోసం అవసరమైన ఓటు కంటే ఒక మెంబర్ ఎక్కువే ఉన్నారని బోండా లెక్కలు చెప్పారు. రాపాకకు బోండా వేసిన కౌంటర్ ఎలా ? ఉన్నా నిజంగానే ఆయన జనసేన నుంచి గెలిచి వైసిపి చెంత చేరిపోయారు. అప్పట్లోనే రాపాకకు గట్టిగా ముట్టాయని జనసైనికులు తీవ్రమైన విమర్శలు చేశారు. మరి ఇప్పుడు అదే రాపాక వైసిపి బహిష్కృత ఎమ్మెల్యేలు, ఆ పార్టీ అధినాయకత్వం మధ్యలోకి దూరి మాట్లాడటం కాస్త విచిత్రంగానే అనిపిస్తోంది.