మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి – వైసిపి బంధం తెగిపోయింది. గత ఏడాదికాలంగానే ఆయన వైసిపిలో అయిష్టంగా కొనసాగుతున్నారు. ఎట్టకేలకు వైసిపి ఎమ్మెల్సీ ఎన్నికలను సాకుగా చూపించి ఆయనను పార్టీ సస్పెండ్ చేసింది. ఇక ఇప్పుడు ఆనం ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే.. ఆయన ఒక స్వేచ్ఛాజీవి. తన అభిప్రాయాలు నిర్మొహమాటంగా చెప్పుకోవచ్చు. వైసిపి నుంచి సస్పెండ్ అయ్యాక ఆనం ప్రెస్ మీట్ లో వైసిపి ప్రభుత్వ అధినేత సీఎం జగన్ తో పాటు.. ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి పై తీవ్రమైన విమర్శలు చేశారు.
అక్కడితో ఆగలేదు. అదిరిపోయే పంచులతో వైసీపీ నేతలు, అభిమానుల చెవులు చిల్లులు పడేలా ఒక ఆటాడుకున్నారు. అసలు ఆనం వేసిన పంచులు చూస్తే వైసిపి నేతలు.. ఆ పార్టీ అభిమానుల చెవుల నుంచి రక్తం కారాల్సిందే. తాను గత సాధారణ ఎన్నికలకు ముందు పార్టీ మారటానికి గల కారణాలను కూడా ఆయన వెల్లడించారు. తాను ఏదో పదవుల కోసమో లేదా.. తన ఆస్తులు పెంచుకోవడం కోసం అప్పుడు పార్టీ మారలేదని.. తనను నమ్ముకున్న కార్యకర్తలు, ప్రజలకు న్యాయం చేయగలను అన్న నమ్మకంతోనే పార్టీ మారి ఎమ్మెల్యేగా పోటీ చేశానని చెప్పారు.
నేను సిబిఐ, ఈడి కేసులు ఎదుర్కోవటానికో లేదా తన కుటుంబ సభ్యులను హత్య చేయటానికో రాజకీయాల్లోకి రాలేదని చేసిన విమర్శలు వైసిపిలో బాగా ఎవరికో తగిలాయి. అంతకుమించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆ పార్టీ శ్రేణులకు కూడా బాగా కాలాయి. తాను ఎనిమిది దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం నుంచి వచ్చానని.. తాను ఎప్పుడూ పదవిలో ఉన్న లేకపోయినా.. ప్రజల సమస్యలపై పోరాడతానని స్పష్టం చేశారు.
నాలుగు దశాబ్దల రాజకీయాల్లో ఏనాడు ప్రజాస్వామ్య విలువలు ఇంతలా దిగజారలేదని.. ఎంతోమంది పెద్దపెద్ద నేతలతో పనిచేశా.. ఎప్పుడు ఇలాంటి దారుణ పరిస్థితి చూడలేదని ఆనం చెప్పారు. ప్రశ్నిస్తే ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్రంతో పాటు.. మా జిల్లాలో జరిగే దోపిడీపై తాను ప్రశ్నించానని.. అభివృద్ధి నిలిచిపోయింది, అరాచకాలు జరుగుతున్నాయని చెప్పడంతో తనను పక్కన పెట్టారని ఆనం వాపోయారు. ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన ప్రతిసారి వినతిపత్రం అందించానని.. ఏనాడు కనీసం ప్రత్యుత్తరం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక తాను క్రాస్ వోటింగ్ చేశానని సజ్జలకు ఎవరు ? చెప్పారు. రాజ్యాంగేతర శక్తితో పరిపాలన చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ? మీడియా ప్రతినిధిగా ఉన్నప్పటి నుంచి సజ్జలను చూస్తున్నాను.. ఆయన వేలకోట్ల రూపాయలు ఎలా ? సంపాదించారు అని ఆనం ఘాటుగా ప్రశ్నించారు. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఏదైనా సమస్య చెప్తే అర్థం చేసుకునేవారు.. వినేవారని.. కానీ వైసీపీలో అలాంటి పరిస్థితులు లేవని.. ఇక్కడ కుంభకోణాలు తప్ప మరేమీ కనిపించడం లేదని ఆనం చెప్పారు.
నేనెప్పుడూ నా వ్యక్తిగత పనులు చేయాలని ప్రభుత్వాన్ని కోరలేదు.. అధికారుల మెడ పై కత్తి పెట్టి పని చేయమనటానికి మీరేం చక్రవర్తులు కాదు ? సామ్రాజ్యధీశులు కూడా కాదు.. విలువలు లేవు కాబట్టే సజ్జల అందరిపై ఆరోపణలు చేస్తున్నారని ఆనం విమర్శించారు. ఇక వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చిన ఆయన.. తన కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి వస్తారా లేదా ? అనేది అప్పటి పరిస్థితులను బట్టి ఉంటుందని చెప్పారు. అలాగే నా భవిష్యత్తు ప్రారంభమైంది తెలుగుదేశంతో అని.. కార్యకర్తలు, సన్నిహితలతో చర్చించి త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.