నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే, సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి మూడేళ్లుగా వైసీపీలో ఉండలేక ఉగ్గబట్టుకుంటూ ఉన్నారు. ఎట్టకేలకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేశారన్న సాకుతో వైసీపీ అధిష్టానం ఆనంను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో ఇప్పుడు ఆనం వైసీపీ బంధాలను తెంచుకున్న పక్షిలా ఉన్నారు.
ఇక ఆయన టీడీపీ కండువా కప్పుకుని వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేయడం దాదాపు ఖరారైనట్టే. ఇక ఆనం టీడీపీలో చేరేందుకు చంద్రబాబు కూడా గ్రీన్సిగ్నల్ ఇచ్చేశారు. అయితే ఆనం రెండు టికెట్లు అడుగుతున్నారని టాక్. ఆయన తాను ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న వెంకటగిరి లేదా నెల్లూరు సిటీ, రూరల్ నుంచి పోటీ చేసి తన కుమార్తె కైవల్యా రెడ్డికి ఆత్మకూరు సీటు అడగాలనుకున్నారు.
అయితే ఆనం కోరుకున్నట్టుగా కాకుండా కుమార్తె కైవల్యా రెడ్డికి ఆత్మకూరు అసెంబ్లీ టికెట్ ఇచ్చి, ఆనంకు నెల్లూరు ఎంపీ సీటు ఇవ్వాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. ఆనంకు నెల్లూరు జిల్లా అంతటా నెట్ వర్క్ ఉంది. అందుకే ఆయన్ను ఎంపీగా పోటీ చేయిస్తే అన్ని నియోజకవర్గాల్లో ఉన్న ఆయన అనుచరులతో పార్టీకి చాలా ప్లస్ అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు.