ఏపీలో వచ్చే సాధారణ ఎన్నికలకు మరో 9 నెలల టైం ఉంది. దాదాపు రాష్ట్రం అంతటా రాజకీయం రాజుకుంటోంది. ఈ క్రమంలోనే కప్పదాట్లు, గోడదూకుళ్లు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పటికే వైసీపీలో అసమ్మతి వాదుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలోనే పార్టీ నుంచి ఏకంగా నలుగురు ఎమ్మెల్యేలను కూడా సస్పెండ్ చేశారు. ఇప్పుడు వాళ్లకు ఫస్ట్ ఆప్షన్గా టీడీపీ, సెకండ్ ఆప్షన్గా జనసేన మాత్రమే గతి అవుతున్నాయి.
ఇక చాలా మంది ఇతర పార్టీల్లో ప్రాధాన్యం లేదనుకున్న వాళ్లు, ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుందని భావించిన వారంతా ఇప్పుడు ఆ పార్టీ వైపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే విశాఖ జిల్లా విశాఖ సిటీకి చెందిన బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సైతం ఇప్పుడు టీడీపీ వైపు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. విష్ణుకుమార్ రాజు బీజేపీ నేత అయినా చంద్రబాబుకు అత్యంత ఆప్తుడు.
ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీలో చంద్రబాబును బాగా పొగిడేవారు. ఇప్పుడు ఏపీలో బీజేపీకి లైఫ్ లేదని భావిస్తోన్న ఆయన ఆ పార్టీ వైపు చూస్తున్నారు. ఏపీలో గత ఎన్నికల్లో బీజేపీ నుంచి ఒంటరిగా పోటీ చేసినా కూడా ఆ ఎన్నికల్లో రాజు గారికి 18 వేల పై చిలుకు ఓట్లు దక్కాయి. అయితే 2024లో మరోసారి ఒంటరిగా పోటీ చేసి ఓడిపోయేందుకు ఆయన సిద్ధంగా లేరు.
దీంతో గత కొంత కాలంగా ఆయన స్వరం మారుతోంది. బీజేపీని ఇరుకున పెట్టేలా మాట్లాడుతున్నారు. దీంతో బీజేపీ వాళ్లు ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆయన బీజేపీలో ఉండలేరని.. టీడీపీలోకి వచ్చి విశాఖ నార్త్ సీటు నుంచి పోటీ చేసే ప్రయత్నాల్లో ఉన్నారంటున్నారు. అయితే ఇప్పుడు అక్కడ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాసరావు ఉన్నారు.
గంటా తిరిగి భీమిలి లేదా మరో సీటుకు మారితే రాజుగారికి ఇబ్బంది ఉండదు. లేకపోతే ఆయన టీడీపీలో చేరినా సీటు ఉండదు. ఇప్పుడు ఆయన ఆ టెన్షన్లోనే ఉన్నారని భోగట్టా ?