తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత కొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇద్దరు కీలక నేతలను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ ఇద్దరు నేతలు ఎవరో కాదు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కీలక నేత మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గత కొంతకాలంగా పార్టీలో తీవ్రమైన ఉక్క పోతకు గురవుతున్నారు.
సిట్టింగ్ ఎంపీగా ఉండి కూడా 2019 ఎన్నికలలో ఆయన సీటు తెచ్చుకోలేకపోయారు. అప్పటినుంచి పార్టీ ఆయనను క్రమంగా దూరం పెడుతూ వస్తోంది. పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత కూడా లేదు. ఈ క్రమంలోనే ఆయన గత కొద్ది నెలలుగా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాల పేరుతో ప్రతి నియోజకవర్గంలోనూ తన అనుచరులతో కలిసి సమావేశాలు పెడుతున్నారు.
అలాగే కొద్ది రోజులుగా జూపల్లి, పొంగులేటి ఇద్దరు బిఆర్ఎస్ తో పాటు సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. పొంగులేటి అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తన వర్గం నేతలతో సమావేశాలు పెడుతూ పార్టీ మారేందుకు సిద్ధంగా ఉండాలని సంకేతాలు కూడా ఇస్తున్నారు. ఆదివారం కొత్తగూడెంలో పొంగులేటి శ్రీనివాస్ ఆత్మీయ సమావేశంలోనూ జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.
ఇక జూపల్లి అయితే ఈ ప్రభుత్వం దానిని నడిపిస్తున్న సీఎం ఎనిమిదిన్నర సంవత్సరాల కాలంలో చేసిన తప్పులకు శిక్ష అనుభవించక తప్పదని మండిపడ్డారు. పార్టీలోనే ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న ఈ ఇద్దరు నేతలపై గత కొంతకాలంగా నెలకొన్న సస్పెన్స్ ఎట్టకేలకు తెరపడింది. వీరిద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఇప్పుడు రాజకీయంగా ఈ ఇద్దరి దారులు ఎలా ? ఉంటాయి అన్నదే ఆసక్తిగా ఉంది.