ఉమ్మడి విశాఖ జిల్లాలో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. వచ్చే ఎన్నికలలో చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు దక్కే పరిస్థితి లేదు. ఈ క్రమంలోనే యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజుకు కూడా ఈసారి టిక్కెట్టు దక్కే అవకాశాలు లేవని వైసీపీలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇక్కడ బలమైన కాపు సామాజిక వర్గం ప్రభావం ఎక్కువ. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కన్నబాబురాజు ఏకంగా మూడుసార్లు ఎమ్మెల్యేగా సంచలన విజయం సాధించారు.
ఓవైపు ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంది. ఈసారి యలమంచిలిలో కన్నబాబురాజు పరిస్థితి కూడా సానుకూలంగా లేదు. పైగా ఈసారి కాపు సామాజిక వర్గం కన్నబాబు రాజుకు సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. గత ఎన్నికలలోనే కన్నబాబురాజు కేవలం 4000 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు. మళ్లీ ఆయన పోటీ చేస్తే ఈసారి ఇక్కడ వైసిపికి ఓటమి తప్పదని పలు సర్వేలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే వైసిపి అధిష్టానం ఆయనను పక్కన పెట్టేసి కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికి సీటు ఇవ్వాలని ఆలోచనలు చేస్తుంది.
అయితే కన్నబాబురాజు మాత్రం తనకు సీటు ఇవ్వాలని.. లేని పక్షంలో తన కుమారుడు డిసిసిబి మాజీ చైర్మన్ సుకుమార్ వర్మకు అయినా సీటు ఇవ్వాలని పట్టుపడుతున్నారు. ఇక్కడే మరో ఆసక్తికర పరిణామం కూడా కనిపిస్తోంది. ఈసారి అనకాపల్లిలో మంత్రి గుడివాడ అమర్నాథ్ గెలిచే సూచనలు లేవని అంటున్నారు. ఈ క్రమంలోనే గుడివాడ అమర్నాథ్ యలమంచిలికి షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.
అందుకే అమర్నాథ్ తరచు యలమంచిలి నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నట్టు కూడా చెబుతున్నారు. అలాగే 2014 ఎన్నికలలో ఇక్కడి టిడిపి నుంచి గెలిచిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు కూడా ఇక్కడ నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. ఏది ఏమైనా ఈసారి కన్నబాబు రాజుకు అయితే సీటు దక్కే అవకాశాలు లేవని తెలుస్తోంది.