ఏపీ సీఎం చంద్రబాబు కోడలు, పార్టీ యువనేత జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి వచ్చే ఎన్నికల రంగంలోకి దిగనున్నారా ? ఆమె తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారా ? అంటే టిడిపి వర్గాల్లో ఈ విషయం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి 2019 ఎన్నికలలో ఆమె గుంటూరు ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. అప్పుడు గుంటూరు సిట్టింగ్ ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ చంద్రగిరి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని లేదా.. రాజ్యసభకు వెళతారని.. బ్రాహ్మణి గుంటూరు లోక్సభ బరిలో ఉంటారని ప్రచారం జరిగింది.
అయితే ఆ ఎన్నికలలో ఆమె పోటీ చేయలేదు. మంగళగిరి నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన తన భర్త లోకేష్ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇక ఏపీలో వచ్చే సాధారణ ఎన్నికలకు ఏడాది సమయం ఉంది. మరోసారి బ్రాహ్మణి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నట్టు టిడిపి వర్గాల్లో చర్చ జరుగుతోంది. బ్రాహ్మణి భర్త మరోసారి మంగళగిరి నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే బ్రాహ్మణి కూడా ఈసారి కచ్చితంగా గుంటూరు లోక్సభ బరిలో ఉంటారని తెలుస్తోంది.
గుంటూరు ఎంపీగా టిడిపి తరఫున గత రెండు ఎన్నికలలో వరుస విజయాలు సాధిస్తున్నారు గల్లా జయదేవ్. అయితే వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జయదేవ్ వ్యాపారాలపై బాగా దెబ్బ కొట్టారు. దీంతో ఒకానొక సమయంలో ఆయన రాజకీయాలపై విరక్తి పెంచుకున్నారు కూడా..! ఇక వచ్చే ఎన్నికలలో జయదేవ్ తాను లోక్సభ నుంచి పోటీ చేయనని.. రాజ్యసభకు వెళ్ళిపోతానని ఇప్పటికే చంద్రబాబుకు చెప్పినట్టు తెలుస్తోంది. జయదేవ్ లాంటి పారిశ్రామికవేత్త లోక్సభ నుంచి ఎంపీగా గెలిచినా లేదా రాజ్యసభ ఎంపీగా ఉన్నా వారి వ్యాపార వ్యవహారాలు చక్కబెట్టుకోవచ్చు.
ప్రత్యక్ష ఎన్నికల బరిలో పోటీ చేసి లోక్సభ ఎంపీగా గెలిస్తే రాజకీయంగా ప్రజలకు సరైన టైమ్ కేటాయించలేకపోతున్నాను అన్న ఆవేదన జయదేవ్ కి ఉంది. అందుకే ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండి పార్టీ అధికారంలోకి వచ్చాక రాజ్యసభకు వెళ్లాలని జయదేవ్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే జయదేవ్ తప్పుకుంటే ఖాళీ అయ్యే గుంటూరు ఎంపీ సీటు నుంచి నారా బ్రాహ్మణి రంగంలోకి దిగేలా తెర వెనక ప్లానింగ్ అయితే నడుస్తున్నట్టు తెలుస్తోంది.
బ్రాహ్మణి ఎంపీగా పోటీ చేస్తే ఆ ప్రభావం గుంటూరు లోక్సభ పరిధిలో బలంగా ఉంటుంది. అలాగే గుంటూరు లోక్సభ పరిధిలోనే ఉన్న మంగళగిరిలో నారా లోకేష్ పోటీ చేస్తే బ్రాహ్మణికి మరింత మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక రాజధాని మార్పు ప్రభావం.. ఇటు నందమూరి వారి ఆడపడుచు, నారి వారి కోడలు అనేక సమీకరణలు కలిసి వచ్చి బ్రాహ్మణి బంపర్ మెజార్టీతో విక్టరీ కొడతారని అంచనాలు అయితే ఉన్నాయి. మరి నారా బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీ ఎలా ఉంటుందో ? చూడాలి.