మాచర్ల-నరసారావుపేట అసెంబ్లీ నియోజకవర్గాలు పల్నాడు ప్రాంతంలో రాజకీయంగా కీలకమైన స్థానాలు..ఈ స్థానాల్లో టీడీపీ గెలిచి చాలా ఏళ్ళు అయిపోయింది. అయితే ఈ సారైనా ఆ స్థానాల్లో టిడిపికి గెలిచే అవకాశాలు ఉన్నాయా? అంటే అది డౌట్ అనే పరిస్తితి. అసలు మొదట మాచర్ల గురించి మాట్లాడుకుంటే… ఇక్కడ టిడిపి గెలిచింది కేవలం మూడుసార్లు మాత్రమే..1989, 1994, 1999 ఎన్నికల్లోనే టిడిపి గెలిచింది.
ఇక 1999 తర్వాత ఇక్కడ టిడిపి జెండా ఎగరలేదు. ఎగిరే అవకాశం రాలేదు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ హవా లో టిడిపి ఓడిపోయింది. 2012 ఉపఎన్నికలో వైసీపీ వేవ్ లో ఓడింది. అయితే 2014లో రాష్ట్రంలో టిడిపి గాలి ఉన్నా సరే మాచర్లలో మాత్రం వైసీపీనే గెలిచింది. అంటే అక్కడ వైసీపీని అభిమానించే వారు ఎక్కువ ఉన్నారని చెప్పవచ్చు. ఇక 2019 ఎన్నికల్లో కూడా వైసీపీ హవా నడిచింది. రెడ్డి సామాజికవర్గం ప్రభావం ఎక్కువ వల్ల మాచర్లలో వైసీపీ సత్తా చాటుతుంది.
కానీ ఈ సారి మాచర్లలో వైసీపీకి చెక్ పెట్టాలని టిడిపి నుంచి జూలకంటి బ్రహ్మానందరెడ్డిని రంగంలోకి దింపారు. ఈయన బాగా పనిచేస్తున్నారు. టిడిపి బలం కూడా పెంచారు. కాకపోతే ఇంకా వైసీపీకి చెక్ పెట్టే బలం టిడిపికి రాలేదు. దీంతో మాచర్లలో ఇప్పటికీ వైసీపీదే పై చేయిగా ఉంది. ఇటు నరసారావుపేటలో అదే పరిస్తితి.. 1983 నుంచి 1999 వరకు టిడిపి తరుపున కోడెల శివప్రసాద్ గెలిచారు. 2004 నుంచి ఇక్కడ టిడిపి జెండా ఎగరడం లేదు. వరుసగా నాలుగుసార్లు ఓడిపోయింది.
అయితే టిడిపి తరుపున చదలవాడ అరవింద్ బాబు పనిచేస్తున్నారు. కాకపోతే ఈయన అనుకున్న మేర పార్టీని బలోపేతం చేయడంలో సక్సెస్ అయినట్లు కనిపించడం లేదు. దీంతో నరసారావుపేటలో కూడా టిడిపి వెనుకబడింది. ఇలా ఐదోసారి కూడా మాచర్ల, నరసారావుపేటల్లో టిడిపి ఇంకా కష్టకాలంలోనే కనిపిస్తోంది. ఎన్నికల సమయానికి ఏమైనా మార్పులు జరిగితే టిడిపి నిలబడే ఛాన్స్ ఉంది. లేదంటే అంతే సంగతులు.