బెజవాడ..అంటే రాజకీయాలకు కేరాఫ్ అడ్రెస్..ఇంకా చెప్పాలంటే ఏపీ రాజకీయ రాజధాని అని చెప్పవచ్చు. ఎన్నికలు లేకపోయినా సరే ఇక్కడ నిత్యం పోలిటికల్ గేమ్ నడుస్తూనే ఉంటుంది. అలాంటి బెజవాడలో గత కొనేళ్లుగా టిడిపిదే పైచేయిగా ఉంటూ వస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత నుంచి బెజవాడలో టిడిపి హవా నడుస్తుంది. ముఖ్యంగా పార్లమెంట్ సీటులో టిడిపి విజయాలు కొనసాగుతున్నాయి.
2014, 2019 ఎన్నికల్లో వరుసగా విజయవాడ ఎంపీ సీటుని టిడిపి గెలుచుకుంది..టిడిపి తరుపున కేశినేని నాని వరుసగా గెలిచారు. ఇక మూడోసారి కూడా అక్కడ టిడిపి గెలుపుపై ఎలాంటి ? డౌట్ లేదని తెలుస్తోంది. ఇక మళ్ళీ కేశినేని పోటీ చేస్తారా? ఇంకా ఎవరైనా పోటీ చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే కొంతమంది సొంత పార్టీ నేతలతో కేశినేనికి పడని విషయం తెలిసిందే.
కేశినేని మళ్ళీ పోటీ చేస్తే టిడిపి డౌట్ లేకుండా గెలుస్తుందని కార్యకర్తలు భావిస్తున్నారు. ఇక సీటు ఎవరికి వస్తారనేది చంద్రబాబు చేతులో ఉంది. టిడిపి విషయం పక్కన పెడితే…వైసీపీ ఇంతవరకు ఇక్కడ గెలవలేదు. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ ఓడిపోతూ వస్తుంది. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి కోనేరు రాజేంద్రప్రసాద్ పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో పొట్లూరి వరప్రసాద్(పివిపి) పోటీ చేసి ఓడిపోయారు.
ఆ ఎన్నికల్లో వైసీపీ గట్టి పోటీ ఇచ్చింది గాని..చాలా చోట్ల కేశినేనికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరిగింది. దీంతో వైసీపీ ఓడిపోయింది. మరి ఈ సారి ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారనేది సస్పెన్స్ గా ఉంది. ఇప్పటివరకు కమ్మ నేతలని బరిలో దింపి దెబ్బతిన్నారు. ఈ క్రమంలో విజయవాడ ఎంపీ సీటుని బీసీ నేతకు ఇవ్వాలని జగన్ ఆలోచిస్తున్నారని తెలిసింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే జోగి రమేశ్ని బెజవాడ బరిలో దింపే ఛాన్స్ ఉందని ప్రచారం ఉంది.
ఎలాగో పెడనలో ఆయనపై వ్యతిరేకత ఉంది. ఇటు సొంత స్థానం మైలవరంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఉన్నారు. కాబట్టి ఈ సారి జోగిని విజయవాడ ఎంపీగా బరిలో దింపే అవకాశాలు ఉన్నాయని ప్రచారం వస్తుంది. మొత్తానికి బీసీ ఫార్ములాతో ఈ సారి బెజవాడని కైవసం చేసుకోవాలని జగన్ ప్లాన్. మరి ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందేమో చూడాలి.