ఎస్ ఇది నిజమే. వైసీపీని ఓడించేందుకు ఇప్పుడు వైఎస్సార్ శిష్యురాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళితే ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పాణ్యం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మంచి బలం ఉండేది. తర్వాత కాలక్రమంలో అది వైసీపీకి షిఫ్ట్ అయింది. వైసిపి ఆవిర్భవించాక జరిగిన రెండు ఎన్నికలలోను పాణ్యం నుంచి ఆ పార్టీ అభ్యర్థులే గెలిచారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక ఇప్పటికి 9 సార్లు అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే.. కేవలం పాణ్యంలో రెండుసార్లు మాత్రమే ఆ పార్టీ గెలిచింది అంటే ఆశ్చర్యమే.
ఇక పాణ్యం నుంచి గత నాలుగు దశాబ్దాల కాలంలో ఏకంగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఇక్కడ బలమైన నేతగా ఉన్నారు కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఒక దశలో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసిన కూడా సొంతంగా 60 వేల ఓట్లు తెచ్చుకున్నారు. ఆయన రెండు మూడు తరాలకు చెందిన రాజకీయ నాయకులతో పోటీపడి మరి గెలుస్తూనే వస్తున్నారు. ఆయన సీనియర్ లీడర్ గా ఉన్న ఇప్పటికి మంత్రి పదవి దక్కలేదు.
ఇక 2024 ఎన్నికలలోను మరోసారి పాణ్యం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉండనున్నారు. అయితే ఈసారి సమీకరణలలు అక్కడ ఆయనకు అనుకూలంగా లేవు. విచిత్రం ఏమిటంటే 2014లో గౌరు చరిత రెడ్డి పాణ్యంలో వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆమెను కాదని జగన్ ఎన్నికలకు ముందు పార్టీ మారిన రాంభూపాల్ రెడ్డికి సీటు ఇచ్చారు. దీంతో చరితారెడ్డి టిడిపిలోకి జంప్ చేసి ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
ఎన్నికలలో ఓడిపోయినా నాలుగేళ్ల పాటు ఆమె నిత్యం అటు పార్టీకి అండగా ఉండడంతో పాటు.. ఇటు ప్రజల్లో ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు ఆమె పట్ల ప్రజల్లో సానుభూతి కూడా కనిపిస్తోంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా గెలిస్తే అధికారంలోకి వచ్చే టైంలో జగన్ ఆమెకు సీటు ఇవ్వలేదన్న సానుభూతి పవనాలు నియోజకవర్గంలో కనిపిస్తున్నాయి. పైగా ఒకప్పుడు గౌరు చరితారెడ్డి దివంగత వైఎస్ఆర్ శిష్యురాలు. ఆయనే ఆమెను రాజకీయాలలోకి తీసుకువచ్చారు. ఈసారి వైసిపి కేడర్ నుంచి కూడా ఆమెకు బలమైన సపోర్ట్ దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.
గత ఎన్నికలలో అయితే రాంభూపాల్ రెడ్డి.. చరితా రెడ్డిపై ఏకంగా 44 వేల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. అయితే ఈసారి ఆయన వయోభారంతో అంత యాక్టివ్గా ఉండలేకపోతున్నారని.. దీనికి తోడు చరితా రెడ్డి పై ఉన్న సానుభూతి పవనాలు, ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఇవన్నీ టిడిపికి సానుకూల అంశాలుగా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈసారి రాంభూపాల్ రెడ్డి ఏటికి ఎదురుదుతోన్న మాట వాస్తవం అని తెలుస్తోంది.