ఆయన వైసీపీలో ఓ దళిత ఎమ్మెల్యే. ఓ కీలక శాఖాధికారిగా పనిచేసి ప్రజారాజ్యం పార్టీ నుంచి తన అదృష్టం పరీక్షించుకున్నారు. ఆ తర్వాత వైసీపీ ఆవిర్భావంతో వెంటనే ఆ పార్టీలోకి వెళ్లి ప్రజా ప్రతినిధిగా గెలిచారు. 2014 ఎన్నికల్లో గెలిచిన సదరు నేతకు 2019 ఎన్నికల్లో ఆ సీటు కాకుండా మరో సీటు కేటాయించారు. ఆర్థికంగా కూడా బలంగా ఉండడంతో రెండో సారి సీటు మార్చినా ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
ఇక ఈ ఐదేళ్లలో సదరు ఎమ్మెల్యేకు నియోజకవర్గంలో వైసీపీ కేడర్కు ఏ మాత్రం పొసగడం లేదు. అసలు వైసీపీని శాసించే రెడ్డి సామాజిక వర్గం నేతలు అయితే ఈ సారి ఆయనకు సీటు ఇస్తే మేమే దగ్గరుండి మరీ ఓడిస్తామని శపథాలు చేస్తున్నారు. దీంతో జగన్ వచ్చే ఎన్నికల్లో మీకు సీటు ఇవ్వనని ఇప్పటికే చెప్పేశారు. దీంతో ఆ వైసీపీ ఎమ్మెల్యే టీడీపీ నేతల ద్వారా చంద్రబాబుకు రిక్వెస్ట్ పెట్టుకుంటున్నట్టు తెలుస్తోంది.
వచ్చే ఎన్నికలకు ముందే టైం చూసుకుని మీ పార్టీలోకి వచ్చేస్తాను… నాకు టిక్కెట్ కన్ఫార్మ్ చేయమని అడిగినట్టుగా తెలుస్తోంది. విచిత్రం ఏంటంటే జగన్ సదరు ఎమ్మెల్యేకు టిక్కెట్ ఇవ్వనని చెప్పిన వెంటనే థ్యాంక్స్ అని కూడా చెప్పారట. మరి ఈ సారి వైసీపీ అధికారంలోకి రాదన్న క్లారిటీ రావడంతోనే ఆయన జగన్తోనే అలా అన్నారని అంటున్నారు.
ఆ ఎమ్మెల్యే ఫైనాన్షియల్గా కాస్త స్ట్రాంగ్ కావడంతో టీడీపీ వాళ్లు కొందరు ఆయనతో చర్చలు జరుపుతున్నారట. అయితే నియోజకవర్గంలో తీవ్రమైన వ్యతిరేకత ఉండడంతో ఆయనకు టీడీపీ నుంచి సీటు ఇచ్చినా ఓడిపోతారని కొందరు ఇప్పటికే చంద్రబాబు చెవిలో వేసినట్టు తెలుస్తోంది. అది ఆ వైసీపీ ఎమ్మెల్యే కథ..!