ఆయన జగన్కు అత్యంత నమ్మకస్తుడు అయిన ఎమ్మెల్యే. జగన్ ఆదేశిస్తే చాలు శిరసావహిస్తారు. రెండు సార్లు వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. పైగా జగన్ మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చినా ఇవ్వలేదు. మరో కీలక పదవి కట్టబెట్టి… ఆ అధికారాలు పరిమితం చేసినా ఏమీ అనలేదు. అలాంటి ఎమ్మెల్యే ఇప్పుడు జగన్పై అలకపాన్పు ఎక్కినట్టే వైసీపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఈ రోజు జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పార్టీ కీలక సమావేశానికి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డుమ్మా కొట్టారు. దీంతో ఇప్పుడు పార్టీ వర్గాల్లో ఆళ్ల వైఖరి చర్చనీయాంశంగా మారింది. ఇక గత కొంత కాలంగా కూడా ఆయన పార్టీ కార్యకలాపాల విషయంలో అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు.
పైగా ఈ నెలలో జరిగిన ఆయన కుమార్తె వివాహానికి కూడా సీఎంకు ఆహ్వానం ఇవ్వలేదని మంగళగిరిలో చర్చ నడుస్తోంది. అంటే తన కుమార్తె పెళ్లికి సీఎంను పిలిచేందుకు కూడా ఆళ్ల ఇష్టపడలేదా ? అన్న డౌట్లు వస్తున్నాయి. ఇక వచ్చే ఎన్నికల్లో ఆయనకు మంగళగిరి సీటు ఇవ్వరనే సంకేతాలు రావడంతో ఆళ్ల అలకపాన్పు ఎక్కారంటున్నారు. ఆళ్ల 2014,2019లలో వరుసగా ఆయన మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
2019 ఎన్నికల ప్రచారంలో మంగళగిరిలో పోటీ చేసిన లోకేష్ను ఓడిస్తే ఆల్లకు మంత్రి పదవి ఇస్తానని జగన్ చెప్పారు. బహిరంగంగా ప్రకటన చేశారు. అయితే ఆళ్లకు మంత్రి పదవి ఇవ్వలేదు.. ఇస్తారన్న గ్యారెంటీ లేదు. ఇక వచ్చే ఎన్నికల్లో మంగళగిరిలో బీసీ కార్డును వాడాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆళ్లకు ఇక టిక్కెట్ లేనట్టే…!
మంగళగిరిలో లోకేష్ను మళ్లీ ఓడించాలంటే.. అక్కడ బలంగా ఉన్న చేనేతలకు సీటు ఇవ్వాలన్నదే జగన్ టార్గెట్. ఇప్పటికే చాలా మంది చేనేతలను పార్టీలో చేర్చుకుంటున్నారు. టిక్కెట్ ఇవ్వరన్న కారణంతోనే ఆళ్ల ఈ రోజు కీలక సమావేశానికి కూడా డుమ్మా కొట్టేశారని అంటున్నారు. మరి ఆళ్ల కొద్ది రోజులుగా ముభావంతో ఉంటోన్న మాట వాస్తవం. అసలు వాస్తవాలే ఏమిటో ఆయన క్లారిటీ ఇస్తే కాని తెలియదు.