ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఎమ్మెల్యే కోటా కింద ఉన్న 7 ఎమ్మెల్సీ స్థానాల వ్యవహారం.. తీవ్ర చర్చకు దారి తీస్తోంది. మొత్తం ఏడుగురిని గెలిపించుకుని తీరాల్సిందేనని పార్టీ అధినేత సీఎం జగన్ చెబుతున్నారు. గట్టి పంతం కూడా పట్టారు. ఇప్పటికే బీసీలకు ఎక్కువ స్థానాలు ఇచ్చామని.. చెప్పుకొంటున్న వైసీపీ వీరిని గెలిపించుకుని తీరాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. నిజానికి అసెంబ్లీలో సంఖ్యా బలం కూడా ఎక్కువగానే ఉంది.
అయినప్పటికీ.. వైసీపీకి ఇప్పుడు రెబల్స్ బెడద.. టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహం రెండు కూడా ఇ బ్బందిగా మారాయని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం పైకి కనిపిస్తున్న రెబల్స్ ఇద్దరే. ఆనం రామ నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి. కానీ, పార్టీలో నివురుగప్పిన నిప్పులాగా మరింత మంది వ్యతిరేకులు ఉన్నారని పార్టీ అధినేత సీఎం జగన్ అంచనా వేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఏ చిన్న తేడా వచ్చినా.. ఒక సీటు కోల్పోవడం ఖాయమనే అంచనాలు కూడా వేసుకుంటున్నారు.
మరోవైపు.. చంద్రబాబు ఇప్పటికే వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తు న్నారు. ఆత్మప్రబోధాను సారం.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాలంటూ.. వైసీపీ ఎమ్మెల్యే లను ఆయన కోరారు. కరడు గట్టిన వైసీపీ ఎమ్మెల్యేలను పక్కన పెడితే.. అనేక మంది అసంతృప్త ఎమ్మెల్యేల పైనే చంద్రబాబు వ్యూహాత్మకంగా ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. అయితే.. ఎవరు అసంతృప్తిగా ఉన్నారనేది మాత్రం గోప్యంగానేఉంది.
కానీ, మీడియా కథనాల ప్రకారం.. కోవూరు, దర్శి, గిద్దలూరు, తాడికొండ, మాచర్ల, కనిగిరి, పెనమలూరు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీరంతా కూడా టీడీపీకి అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉందని సైలెంట్గా ఓటేసే ఛాన్స్ ను కాదనలేమని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. పైగా.. ఆత్మప్రబోధాను సారం అని వదిలేస్తే.. ఇబ్బందులు తప్పవని లెక్కలు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే విప్ జారీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఏం చేస్తారో చూడాలి.